విధాత : కలియుగ వైకుంఠం తిరుమలలో రథ సప్తమి వేడుకలు వైభవోపేతంగా సాగాయి. ఆదివారం తెల్లవారుజామున మలయప్ప స్వామికి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. రథసప్తమి సందర్భంగా తిరుమలలో దివ్య వైభవం వెల్లివిరిసింది.

సూర్యప్రభ వాహనంపై కొలువుదీరిన శ్రీ మన్నారాయణుడు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. రథసప్తమి సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో తిరుమల గిరులు భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. శ్రీవారు సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఈ రోజు సప్త వాహనాలలో విహరించనుండటం విశేషం.

అరసవల్లిలో రథసప్తమి వేడుకలకు పోటెత్తిన భక్త జనం

సూర్యభగవానుడి పుట్టిన రోజైన మాఘశుద్ధ సప్తమి(రథ సప్తమి) సందర్భంగా ఏపీలోని ఆదిత్య క్షేత్రం అరసవల్లికి భక్తులు సూర్యనారాయణుడి దర్శనకం కోసం భారీగా తరలివచ్చారు.ప్రపంచానికి వెలుగులనిచ్చే దినకరుడి రథసప్తమి వేడుకలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో దేదీప్యమానంగా వెలిగిపోయాయి.
సూర్యజయంతి రథ సప్తమి పర్వదినాన ఆదినారాయణుడి నిజరూపాన్ని చూసి తరించేందుకు భక్తజనం లక్షలాదిగా తరలిరావడంతో స్వామివారి దర్శనానికి గంటల పాటు క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు. సూర్యభగవానుడి మహాక్షీరాభిషేకానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు కే.రాంమోహన్ నాయుడు, కే. అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ లు పట్టువస్త్రాలు సమర్పించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, అడవిదేవులపల్లి సూర్యదేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.