TGSRTC | హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఈ నెల 21న ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరగనుంది. బోనాల వేడుకకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఈ బోనాల జాతరకు నగరం నలుమూలల నుంచి భక్తులు తరలిరానున్నారు. అంతేకాకుండా జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం 175 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది.
హైదరాబాద్ నగరంలోని 24 ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఎంజీబీఎస్, కాచిగూడ రైల్వేస్టేషన్, జేబీఎస్, చార్మినార్, బాలాజీ నగర్, నాంపల్లి, రిసాల బజార్, వెంకటాపురం, ఓల్డ్ అల్వాల్, మెహిదీపట్నం, కుషాయిగూడ, చర్లపల్లి, హకీంపేట్, ఓల్డ్ బోయిన్పల్లి, చార్మినార్, రాజేంద్రనగర్, సైనిక్పురి, సనత్నగర్, జామై ఉస్మానియా, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, కేపీహెచ్బీ, బోరబండ, పటాన్చెరు తదితర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. బోనాలకు వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ సంస్థ కోరింది. ఈనెల 21, 22న ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఏమైనా బస్సుల ఆలస్యం సమస్యలు ఉంటే 9959226147, 9959226143, 9959226130 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం 175 ప్రత్యేక బస్సులను #TGSRTC నడుపుతోంది. #Hyderabad లోని 24 ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు తిప్పనుంది. కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, పటాన్ చెరు, ఈసీఐఎల్, మెహిదీపట్నం, దిల్ షుక్నగర్, కూకట్… pic.twitter.com/70x6ueJohm
— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) July 19, 2024