Bonalu Festival | బోనాల పండుగలో ఘటం, రంగానికి ఎందుకంత ప్రత్యేకత..? అసలు వాటి అర్థం ఏంటి..?
Bonalu Festival | బోనాల పండుగకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే బోనాల పండుగ ఆగస్టు మొదటి వారం కొనసాగనుంది. హైదరాబాద్ గోల్కొండ కోటలో జగదాంబిక ఆలయంలో తొలి బోనం సమర్పిస్తారు. తర్వాత రెండో బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లికి, మూడో బోనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పిస్తారు.

Bonalu Festival | బోనాల పండుగకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే బోనాల పండుగ ఆగస్టు మొదటి వారం కొనసాగనుంది. హైదరాబాద్ గోల్కొండ కోటలో జగదాంబిక ఆలయంలో తొలి బోనం సమర్పిస్తారు. తర్వాత రెండో బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లికి, మూడో బోనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పిస్తారు. చివరివారం పాతబస్తీలో బోనాల పండుగ జరగనుంది.
ఇక బోనాల పండుగ సందర్భంగా మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. కోరికలు కూడా కోరుతుంటారు. బోనాల పండుగ రోజు పోతరాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. వారి ఆటపాటలతో బోనాల పండుగ ఎంతో ఉత్తేజితంగా సాగుతుంది. అయితే ఈ పండుగ సందర్భంగా మూడు పదాలు వినిపిస్తుంటాయి. అవే విందు, రంగం, ఘటం. ఈ పదాలు ఎందుకు పదేపదే వినిపిస్తాయి. అసలు ఆ పదాల అర్థాలు ఏంటో తెలుసుకుందాం..
విందు
విందు అంటే.. అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయడమే. పాలు, బెల్లం, బియ్యం వేసి కుండలో తయారు చేసిన నైవేద్యాన్ని ఆరగిచండమే. బోనం అనేది అమ్మవారికి సమర్పించే నైవేద్యం. ఇంటికి వచ్చిన అతిథులతో కూడా నైవేద్యాన్ని పంచుకుంటారు.
రంగం
బోనాల పండుగ మరుసటి రోజు ఉదయం రంగం జరుగుతుంది. ఒక స్త్రీ మీదకు మహంకాళి అమ్మవారు ఆవహించి భవిష్య వాణి పలుకుతుందని భక్తుల విశ్వాసం. అంటే ఏడాది మొత్తం ఏ రకంగా ఉండబోతుంది. ఈ రాష్ట్ర పరిపాలన ఎలా ఉండబోతుంది..? ప్రజల భవిష్యత్ ఏంటి..? అనే విషయాలను రంగంలో చెబుతుంటారు. వర్తమానంలో ప్రజలకు జరిగిన నష్టాన్ని వివరిస్తూనే భవిష్యత్ గురించి చెప్పడమే రంగం ఉద్దేశం.
ఘటం
అమ్మవారి ఆకారంగా అలంకరించే రాగి కలశాన్ని ఘటం అంటారు. పూజారి ఈ అమ్మవారి ప్రతిమగా కలశాన్ని తీసుకుని వెళతాడు. ఘటాన్ని ఉత్సవాల మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు నీటిలో నిమజ్జనం చేసి ఊరేగింపుగా తీసుకుని వెళతారు. రంగం తర్వాత ఘటం ఉత్సవం జరుగుతుంది. డప్పులు, మేళ తాళాల మధ్య ఊరేగింపుగా పూజారి ఘటాన్ని తీసుకుని వెళతారు. ఆ తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తారు.