Tirupatamma Ammavari Devasthanam | శ్రీలక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయం..( Tirupatamma Ammavari Devasthanam )ఏపీ ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు గ్రామం( Penuganchiprolu Village )లో కొలువై ఉంది. మున్నేరు నది( Munneru River ) ఒడ్డున కొలువైన ఈ ఆలయం 17వ శతాబ్దానికి చెందిన ప్రాచీన శక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారిని శక్తి స్వరూపిణిగా భక్తులు ఆరాధిస్తారు. ప్రస్తుతం తిరుపతమ్మ తిరునాళ్లు భక్తి ఉత్సాహాలతో కొనసాగుతున్నాయి. సాధారణ మనిషిగా జన్మించి, తన పవిత్ర జీవనంతో దైవత్వాన్ని పొందిన అమ్మవారిగా తిరుపతమ్మ కథనం చెప్పబడుతుంది. అలాంటి మహిమాన్విత క్షేత్రం ఇదే.
తిరుపతమ్మ ఆలయ చరిత్ర ఇదే..
పెనుగంచిప్రోలు మండల పరిధిలోని పాలెం గ్రామంలో శివరామయ్య – రంగమ్మ అనే దంపతులు నివసించేవారట. వీరికి సంతానం కలగలేదట. తమకు వారసత్వం ఉండాలనే కోరికతో.. చివరకు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించారట. మొత్తానికి ఏడు కొండల వాడి ఆశీర్వాదంతో.. రంగమ్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపకు తిరుపతమ్మగా నామకరణం చేశారట. దైవానుగ్రహంతో జన్మించిన తిరుపతమ్మకు చిన్ననాటి నుంచే దైవభక్తి, వినయం, కరుణ గుణాలు ఎక్కువ. ఆమె తేజస్సు, మృదుత్వం గ్రామస్థులందరినీ ఆకట్టుకునేవట.
తిరుపతమ్మకు గోపయ్యతో వివాహం..
పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన గోపయ్యతో తిరుపతమ్మకు పెళ్లైందట. తిరుపతమ్మ అత్తారింట్లో అడుగుపెట్టగానే వారి నివాసంలో సకల ఐశ్వర్యాలు సిద్ధించాయట. తిరుపతమ్మపై భర్తకు మరింత ప్రేమ ఉప్పొంగిందట. ఇది అత్తమామలకు నచ్చలేదట. ఒకసారి గోపయ్య అడవికి వెళ్లగా.. ఆ సమయంలో తిరుపతమ్మను అత్తమామలు హింసించారట.
గోపయ్య మరణం.. తిరుపతమ్మ దివ్యత్వం
దురదృష్టవశాత్తు అడవిలో పులి దాడికి గురై గోపయ్య మరణించాడట. ఆ వార్త గ్రామానికి చేరకముందే తిరుపతమ్మకు ఆ విషయం తెలిసిందట. ఆ సమయంలో ఆమె ముఖకాంతి మరింత దివ్యంగా మారిందట. గ్రామస్థులను సమీకరించి, తనకు, తన భర్తకు ఆలయాలు నిర్మించి పూజలు జరపాలని ఆమె కోరిందట. కష్టకాలంలో అండగా నిలిచిన పాపమాంబ వంశీకుల నుంచే ప్రథమ పూజలు అందుకోవాలని చెప్పి ఆమె అదృశ్యమయ్యిందట.
ఇలదేవతగా తిరుపతమ్మ ఆరాధన
తిరుపతమ్మ ఆజ్ఞ ప్రకారం గ్రామస్థులు ఆలయ నిర్మాణం చేసి పూజలు ప్రారంభించారట. అప్పటి నుంచి తిరుపతమ్మ ఆ ప్రాంత ప్రజల ఇలదేవతగా, ఇష్టదేవతగా వెలుగొందుతోంది. ఎంతోమంది భక్తులు తమ పిల్లలకు అమ్మవారి పేరును పెట్టుకోవడం ద్వారా తమ భక్తిని చాటుకుంటున్నారు.
ఒక్కసారి దర్శిస్తే చాలు వివాహం, సంతానం ఖాయం..
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుంటే వివాహ సంబంధ సమస్యలు తొలగిపోయి త్వరగా వివాహం జరుగుతుంది. ఇక సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని విశ్వాసం. అంతేగాక, ఆలయాన్ని దర్శించుకున్నవారికి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ అద్భుత ఆలయాన్ని మీరు ఒకసారి దర్శించుకోండి.
