Shiva Jyothi | ప్రముఖ యాంకర్, బిగ్బాస్ ఫేమ్ శివజ్యోతి (సావిత్రి) మరోసారి వివాదంలో నిలిచారు. శివజ్యోతి తన భర్త గంగూలీ, ఫ్రెండ్ సోనుతో కలిసి ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం బయటకు వస్తూ భక్తులకు అందించే శ్రీవారి ప్రసాదం తీసుకుంటున్న సమయంలో తీసిన వీడియోనే ఇప్పుడు ఆమెను ట్రోలింగ్ బారిన పడేలా చేసింది.
కాస్ట్లీ ప్రసాదం అడుక్కున్నాడు..
భక్తులకు అందించే లడ్డు ప్రసాదం తీసుకుంటుండగా, శివజ్యోతి .. “సోను కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాడు ఫ్రెండ్స్” అని నవ్వుతూ కామెంట్ చేశారు. దీనిపై సోను, “జీవితంలో ఎప్పుడూ అడుక్కోలేదు… ఫస్ట్ టైమ్ అడుక్కున్నా” అని స్పందించాడు. ఇది అక్కడితో ఆగలేదు. శివజ్యోతి నవ్వుతూ.. “తిరుపతిలో రిచెస్ట్ బిచ్చగాళ్లం” అని చెప్పడం వీడియోలో కనిపించింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… భక్తులు, హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భక్తుల ఆగ్రహం..
తిరుమల వంటి పవిత్రక్షేత్రంలో ప్రసాదాన్ని ‘అడుక్కోవడం’, భక్తులను ‘బిచ్చగాళ్ల’తో పోల్చడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. శ్రీవారి ప్రసాదాన్నిఅవమానించారు, ఇది ఆమె అసలు స్వరూపం, ప్రసాదం విషయంలో అలాంటి పదాలు వాడతారా? అంటూ ఎండగడుతున్నారు. టీటీడీ ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కొన్ని కామెంట్లు కూడా కనిపిస్తున్నాయి.
తీన్మార్ సావిత్రి నుంచి సెలబ్రిటీగా ఎదిగిన శివజ్యోతి
శివజ్యోతి ‘తీన్మార్’ సావిత్రిగా టీవీ ప్రేక్షకులకు బాగా సుపరిచితం. బిత్తిరి సత్తితో కలిసి చేసిన ఈ సెటైరికల్ షోతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తరువాత బిగ్ బాస్ 3 సీజన్లో పాల్గొని మరింత ఫేమ్ సంపాదించారు. ప్రస్తుతం ఆమె వివిధ కార్యక్రమాల్లో గెస్ట్గా పాల్గొంటూ, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. ఇటీవల గర్భవతి అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గత కొద్ది రోజులుగా తన ప్రగ్నెన్సీకి సంబంధించిన అనేక విషయాలు ఇన్స్టాలో షేర్ చేస్తూ వస్తుంది. రీసెంట్గా తన సీమంతం వేడుకలకి సంబంధించిన పిక్స్ షేర్ చేయగా, అవి నెట్టింట వైరల్ అయ్యాయి.
