Sugar Tips | ఇవి మీ ఆహారంలో భాగమైతే మధుమేహం అదుపులో ఉన్నట్టే..!

  • Publish Date - April 9, 2024 / 10:07 AM IST

Sugar Tips : ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా అన్ని వయసుల వారికి మధుమేహం వస్తున్నది. ఈ దీర్ఘకాలిక వ్యాధి ఇంతలా పెరిగిపోవడానికి కారణం.. సమయపాలన లేని ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిళ్లతో కూడిన జీవన విధానమేనని వైద్యులు చెబుతున్నారు. అయితే ఒక్కసారి మనం షుగర్‌ బారిన పడ్డామంటే.. దానికితగ్గ మెడిసిన్లు వాడటం ఎంత ముఖ్యమో తగిన ఆహార నియమాలు పాటించడం కూడా అంతే ముఖ్యం. లేదంటే ఒంట్లో చక్కెర స్థాయిలు పెరిగి మరిన్ని ఇబ్బందుల్లో పడటం ఖాయం. కాబట్టి మధుమేహులు తప్పకుండా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..?

ఆకు కూరలు

షుగర్‌ పేషెంట్లకు అన్ని రకాల ఆకు కూరలు మంచివే. అయితే అన్నిటికంటే పాలకూర ఇంకా మంచిది. ఎందుకంటే దీనిలో కావాల్సినంత ఫైబర్‌ ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారం వెంటనే జీర్ణం కాకుండా చూస్తుంది. దీనివల్ల ఆహారంలోని చక్కెరలు ఒకేసారి రక్తంలో కలువకుండా ఉంటాయి. షుగర్‌ లెవల్స్‌ అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉండదు.

కాయగూరలు

ఇక కాయగూరల విషయానికొస్తే మధుమేహం ఉన్నవారు టమాట, వంకాయ, బీరకాయ, గోకరకాయ, చిక్కుడుకాయ, బెండకాయ, క్యాబేజి, కాలీఫ్లవర్‌, బ్రకోలి, దోసకాయ, మునగకాయ, సొరకాయ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అయితే వీటన్నిటికంటే టమాటాలు చాలా మంచివి. వీటిలో కేలరీలు తక్కువ. పైగా C విటమిన్ ఉంటుంది. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారికి కంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టమాటాల్లో ఉండే విటమిన్ A కంటి చూపును మెరుగుపరుస్తుంది.

బ్రకోలి

డయాబెటిస్‌ ఉన్నవారికి బ్రకోలీ కూడా మంచి ఆహారం. దీనిలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ఫైబర్‌తోపాటు విటమిన్ A, C, K ఉంటాయి. దాంతో ఇది మన రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బ్రకోలీలో గుండె సమస్యలు రాకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది.

పప్పు దినుసులు

షుగర్ పేషెంట్ల ఆహారంలో పప్పు దినుసులు ఎక్కువగా ఉండేలా చూడాలి. పప్పు దినుసుల నుంచి లభించే ప్రొటీన్‌లు మాంసాహారంలో లభించే ప్రొటీన్‌ల కంటే మేలైనవి. ఇవి ప్రొటీన్లతోపాటు ఫైబర్స్‌ను కూడా అధికంగా కలిగి ఉంటాయి. ఈ రెండు పదార్థాలు రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంచుతాయి.

చేపలు

మధుమేహం ఉన్నవారు చేపలు తింటే చాలా మంచిది. హెర్రింగ్, సార్డైన్, సాల్మన్, అల్బకోర్, ట్యూనా, మాకేరాల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్ని పెంచుతాయి. అందుకే షుగర్‌ పేషెంట్లు వారంలో ఒక్క రోజైనా చేపలను తింటే మంచిది. అయితే వేపుళ్ల రూపంలో కాకుండా, ఉడికించి తినడం ఉత్తమం.

ఓట్స్, బెర్రీస్‌

ఇవి శరీరంలోని చెడు కొవ్వులను తగ్గించి, రక్తంలోని చక్కెర స్థాయిలను సాధారణ స్థితిలో ఉంచే ఆరోగ్యవంతమైన ఫైబర్‌ను కలిగి ఉంటుంది. ప్లెయిన్ ఓట్స్ తక్కువ చక్కెరలను కలిగి ఉండి, నెమ్మదిగా జీర్ణమవుతాయి. బెర్రీస్ తక్కువగా కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంటాయి.

Latest News