విధాత, హైదరాబాద్ : ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ రాష్ట్ర అధికారిక గీత రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ఘట్ కేసర్ లో మంగళవారం అధికారిక లాంఛనాల మధ్య జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర మంత్రులు అందెశ్రీ అంత్యక్రియల్లో పాల్గొని ఆయన పాడె మోశారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి ఓదార్చారు.
పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలు పార్టీల ప్రజాప్రతినిధులు, సాహితీ వేత్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో అందెశ్రీ అంత్యక్రియలకు హాజరయ్యారు. అమర్ హై అందెశ్రీ, జోహార్ అందెశ్రీకి అంటూ నినదించారు. దివికేగిన తెలంగాణ కవి తేజం అందెశ్రీకి కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులు, అభిమానుల ఆశ్రునయనాల మథ్య, సాయుధ పోలీసుల గౌరవ వందనం మధ్య అందెశ్రీ పార్టీవ దేహాన్ని ఖననం చేసి అంత్యక్రియలు నిర్వహించారు. అందేశ్రీకి గౌరవ సూచకంగా పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి గన్ శాల్యూట్ చేశారు.
పాడె మోసి… ప్రముఖ కవి డా.అందెశ్రీ గారికి కడసారి వీడ్కోలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి @revanth_anumula గారు..#Andesri #Telangana#JayaJayaheTelangana pic.twitter.com/3DatcLPelO
— Sridhar Mamidala (@Sridharmamidala) November 11, 2025
