హైలైట్స్:
- QR చెల్లింపులతో వ్యాపారులకు చిక్కులు
- మోసపు డబ్బుతో షాపింగ్ చేస్తున్న నేరగాళ్లు
- తప్పుడు డబ్బు కావడంతో ఖాతాలు ఫ్రీజ్
- తెలియని మోసంతో లబోదిబోమంటున్న వ్యాపారులు
హైదరాబాద్: షాపులోకి వచ్చిన కస్టమర్ వస్తువులు కొనుగోలు చేసి QR కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తే.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో వ్యాపారికెలా తెలుస్తుంది? ఇప్పుడు హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో దుకాణదారులను వేధిస్తున్న పెద్ద ప్రశ్న ఇదే.
సైబర్ నేరగాళ్లు, మ్యూల్ అకౌంట్ హోల్డర్లు మోసాల ద్వారా వచ్చిన డబ్బును మార్కెట్లో చలామణీ చేసేందుకు కొత్త మార్గాలు అనుసరిస్తున్నారు. షాపులు, మాల్స్, మద్యం దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల్లో వస్తువులు కొనుగోలు చేసి QR కోడ్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. వ్యాపారికి అది సాధారణ డిజిటల్ లావాదేవీలా కనిపించినా.. తర్వాత అదే ట్రాన్సాక్షన్ సైబర్ క్రైమ్ డబ్బు ప్రయాణపు విచారణలో భాగమవుతోంది.
వ్యాపారుల ఖాతాల్లో మోసపు డబ్బులు – అకౌంట్లను స్తంభింపజేస్తున్న పోలీసులు
సైబర్ మోసం జరిగిన తర్వాత బాధితులు పోలీసులను ఆశ్రయిస్తారు. కేసు నమోదు చేసిన పోలీసులు డబ్బు ఎక్కడికి వెళ్లిందో ట్రేస్ చేస్తారు. ఈ క్రమంలో మోసపు డబ్బు ఏ వ్యాపారి ఖాతాలోకి చేరిందో గుర్తించి, సంబంధిత బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారు.
ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. మోసంతో సంబంధం లేని వ్యాపారులు కూడా ఖాతాలు స్తంభించిపోవడంతో ఇబ్బందుల్లో పడుతున్నారు. సరుకులు కొనలేకపోవడం, సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోవడం, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
‘వ్యాపారి డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో ఎలా తెలుసుకుంటాడు?’
ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని తెలంగాణ వైన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. వెంకటేశ్వరరావు తెలిపారు. ఒక కేసులో మ్యూల్ అకౌంట్ హోల్డర్ మోసపు డబ్బుతో డిజిటల్ చెల్లింపు చేసి మద్యం కొనుగోలు చేశాడని, కానీ ఇప్పుడు దుకాణ యజమానే ఖాతా స్తంభనతో ఇబ్బంది పడుతున్నాడని ఆయన చెప్పారు.
“షాపుకి వచ్చిన కస్టమర్ చెల్లించిన డబ్బు మూలం వ్యాపారి ఎలా తెలుసుకుంటాడు?” అని ఆయన ప్రశ్నించారు. చాలా సందర్భాల్లో ఖాతా ఎందుకు ఫ్రీజ్ అయిందో కూడా వ్యాపారులకు వెంటనే తెలియక ఆందోళనకు గురవుతున్నారని అన్నారు.
NOCలతో ఖాతాలపై ఆంక్షల ఎత్తివేత
సైబర్ క్రైమ్ అధికారులు మాత్రం ఫిర్యాదు వచ్చిన తర్వాత చట్టపరమైన ప్రక్రియలో భాగంగా డబ్బు ప్రయాణించిన దారిని అనుసరించి ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నామని చెబుతున్నారు. అదే సమయంలో నిజంగా మోసంతో సంబంధం లేని వ్యక్తులు, వ్యాపారులకు బ్యాంకు ఆంక్షలు ఎత్తివేయించేందుకు అవసరమైన No Objection Certificateలు జారీ చేయడంలో సహాయం చేస్తున్నామని అధికారులు తెలిపారు.
డిజిటల్ చెల్లింపులు విస్తృతమవుతున్న వేళ, సైబర్ నేరగాళ్లు వాటినే మోసపు డబ్బు మార్పిడికి ఉపయోగిస్తుండటం వ్యాపారుల్లో కొత్త భయాన్ని కలిగిస్తోంది. QR పేమెంట్ తీసుకున్నందుకు కూడా పోలీసు విచారణ, బ్యాంకు ఖాతా ఫ్రీజ్ వంటి పరిస్థితులు ఎదురవుతుండటంతో చిన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల దుకాణదారులు మళ్లీ నగదు చెల్లింపునే ఇష్టపడుతున్నారు.