RRR Farmers Siege HMDA Office | త్రిబుల్ ఆర్ రైతుల హెచ్ఎండీఏ ఆఫీస్ ముట్టడి..ఉద్రిక్తం

రీజినల్ రింగ్ రోడ్డు (RRR) నిర్వాసిత రైతులు హెచ్‌ఎండీఏ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురిని అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Oct 06, 2025, 4:39 pm IST
Read Time: 3 mins
RRR Farmers Siege HMDA Office | త్రిబుల్ ఆర్ రైతుల హెచ్ఎండీఏ ఆఫీస్ ముట్టడి..ఉద్రిక్తం

విధాత, హైదారాబాద్ : త్రిబుల్ ఆర్ రైతుల హెచ్ఎండీఏ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం సోమవారం అరెస్టులు..ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. త్రిబుల్ ఆర్ రైతులు తమ సమస్యలపై హెచ్ఎండీఏ ఆఫీస్ ముట్టడికి బయలుదేరగా..వారిని చౌటుప్పల్, వలిగొండ, భువనగిరి, రాయగిరి తదితర త్రిబుల్ ఆర్ ప్రాంతాల్లో ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదాలు, తోపులాటలు ఉద్రిక్తతకు దారితీశాయి. తీవ్ర నిర్భందాల మధ్యలనే పలువురు రైతులు హైదరాబాద్ కు చేరుకుని సీపీఎం ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ ఆఫీస్ ముట్టడిని నిర్వహించారు. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో మరోసారి పోలీసులతో వారికి వాగ్వాదం, తోపులాట కొనసాగి ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సమయంలో హెచ్ఎండీఏ అధికారి రైతుల వద్దకు వచ్చి వారు అందించిన వినతి పత్రం స్వీకరించడంతో రైతులు శాంతించారు.

ధర్నాలో పాల్గొన్నసీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ రీజినల్ రింగ్ రోడ్డు నిర్వాసితుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారించాలని డిమాండ్ చేశారు. పాత అలైన్మెంట్ కొనసాగించాలన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా పారిశ్రామిక వేత్తల భూములను కాపాడుతూ చిన్న, సన్నకారు రైతుల భూముల నుంచి త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చడం అన్యాయమన్నారు. త్రిబుల్ ఆర్ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఆందోళన ఉదృతం చేస్తామన్నారు.