Brazil Rains | బ్రెజిల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఆ దేశంలోని దక్షిణాది రాష్ట్రమైన 'రియో గ్రాండే దో సుల్'లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు ఇప్పటికే 37 మందిని బలితీసుకున్నాయి. మరో 74 మంది గల్లంతయ్యారు. ఇది చరిత్రలోనే అత్యంత దారుణమైన విపత్తుగా అక్కడి అధికారులు పేర్కొన్నారు.
Brazil Rains : బ్రెజిల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఆ దేశంలోని దక్షిణాది రాష్ట్రమైన ‘రియో గ్రాండే దో సుల్’లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు ఇప్పటికే 37 మందిని బలితీసుకున్నాయి. మరో 74 మంది గల్లంతయ్యారు. ఇది చరిత్రలోనే అత్యంత దారుణమైన విపత్తుగా అక్కడి అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలోని పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఇళ్లు, వంతెనలు కూలిపోయాయి. రహదారులు శిథిలమయ్యాయి.
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. కూలిన ఇళ్లు, వంతెనలు, రోడ్ల శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని గుర్తించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు గవర్నర్ ఎడ్వర్డో లైట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. చరిత్రలోనే అత్యంత దారుణమైన విపత్తును ఎదుర్కొంటున్నామన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గవర్నర్ చెప్పారు.
బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా గురువారం రాష్ట్రాన్ని సందర్శించి స్థానిక అధికార యంత్రాంగంతో సమావేశమయ్యారు. ఘటనపట్ల తన సంఘీభావం తెలిపారు. ఈ వర్షంవల్ల నష్టపోయిన ప్రజల అవసరాలను తీర్చేందుకు మా ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఆయన పేర్కొన్నారు. వర్షం కారణంగా 10 వేల మందికి పైగా ప్రజలు ఆవాసాలు కోల్పోయారు.
సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో 626 రక్షణ బృందాలతోపాటు 12 విమానాలు, 45 వాహనాలు, 12 బోట్లు పనిచేస్తున్నాయి. రోడ్లను క్లియర్ చేయడం, ఆహారం, నీరు, పరుపులు లాంటి అవసరమైన సామాగ్రిని పంపిణీ చేయడం, నిర్వాసితులకు షెల్టర్లను ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.