Monsoon | హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. కేరళతో పాటు తమిళనాడులోకి ప్రవేశించిన రుతుపవనాలు.. మరో రెండు రోజుల్లో ఇతర ప్రాంతాల్లోకి విస్తరించనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోకి మరో నాలుగైదు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. దాదాపుగా 8, 9 తేదీల్లో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
రాబోయే ఐదు రోజుల్లో చాలా విస్తారంగా వర్షాలు కురుసే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్య తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడివ వర్షాలు కురవనున్నాయి. దీనితో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లోనే ఈదురు గాలుల ప్రభావం ఉండనుంది. రేపు మధ్య తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షం నమోదయ్యే సూచనలున్నాయి. రేపటి నుంచి వచ్చే నాలుగు రోజుల్లో భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి.