ఇరాన్ దేశం అన్నంత పని చేసింది. ఇరాన్ దాడిని ఇజ్రాయెల్, అమెరికా దేశాలు సంయుక్తంగా తిప్పి కొట్టాయి. ఇరాన్ ప్రయోగించిన సుమారు 70కి పైగా డ్రోన్లు, మూడు బాలిస్టిక్ క్షిపణులను అమెరికా దళాలు నేలమట్టం చేశాయి
ఎప్పుడూ అండగా ఉంటామని బైడెన్ హామీ
విధాత, హైదరాబాద్: ఇరాన్ దేశం అన్నంత పని చేసింది. ఇరాన్ దాడిని ఇజ్రాయెల్, అమెరికా దేశాలు సంయుక్తంగా తిప్పి కొట్టాయి. ఇరాన్ ప్రయోగించిన సుమారు 70కి పైగా డ్రోన్లు, మూడు బాలిస్టిక్ క్షిపణులను అమెరికా దళాలు నేలమట్టం చేశాయి. మధ్యధరా సముద్రంలోని తమ యుద్ధ నౌకలు క్షిపణులపై స్పందించాయని ప్రకటించింది. అయితే ఇరాన్ 300 డ్రోన్లు, 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వీటిలో అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకాయి.
ఈ ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీన సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ముందు జరిగిన దాడిలో పెద్ద ఎత్తున ఇరాన్ రివల్యూషనరీ గార్డ్సుతో పాటు ఉన్నతాధికారులు చనిపోయారు. దాడికి ఇజ్రాయెల్ కారణమని, దీనికి ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటామని ఇరాన్ కొద్ది రోజులుగా హెచ్చరిస్తూ వస్తున్నది. తమ దేశ అస్థిత్వానికి ముప్పు కలిగితే సహించలేమని, ఇజ్రాయెల్ పై దాడి చేస్తామని ప్రకటించిన 48 గంటల్లోనే దాడుల పరంపరను ఇరాన్ తమ దేశం భూభాగం నుంచే ఆదివారం మొదలుపెట్టింది. ఇరాన్ దేశం తొలిసారి ప్రత్యక్ష దాడులకు దిగింది. మూడు వందల డ్రోన్లు, వందకు పైగా బాలిస్టిక్ క్షిపణులను ఉపయోగించినప్పటికీ అవి లక్ష్యాలను చేరుకోలేకపోయాయి. ఇందులో కొన్ని మాత్రమే ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకాయి. ఇరాన్ నుంచి ఇరాక్ గగనతలం మీదుగా డ్రోన్లను ప్రయోగించినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అప్రమత్తమైన ఇజ్రాయెల్ దేశంతో పాటు జోర్డాన్, లెబనాన్, ఇరాక్ లు వాటి గగనతలాన్ని మూసివేశాయి. కాగా ఈ దాడిలో ఐడిఎఫ్ స్థావరం యాభై శాతం మేర దెబ్బ తినగా, ఒకరు గాయపడ్డారు. దాడికి ముందు అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహుతో టెలిఫోన్ లో సుధీర్ఘంగా మాట్లాడి, అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చరు. మేము మీకు ఇనుప కవచంలా ఉంటామని, భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని అన్నారు. మా సైనికులు అసాధారణ నైపుణ్యం ప్రదర్శించారని, ఇరాన్ ప్రయోగించిన అన్ని క్షిపణులు, డ్రోన్లు కూల్చివేయడానికి సాయం చేశామని బైడెన్ ప్రకటించారు. భీకర దాడులను ఎదుర్కోని శత్రువును ఓడించడంలో అద్భత సామర్థ్యాన్ని చూపించారని కొనియాడారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఇరాన్ ఇక నుంచి సిద్ధంగా ఉండాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమన్ నెతన్యాహు హెచ్చరించారు.
దాడి తరువాత ఐక్య రాజ్య సమితిలో ఇవాళ ఉదయం ఇరాన్ శాశ్వత ప్రతినిధి స్పందించారు. అవసరం ఉన్న ప్రతిక్షణం తమ దేశానికి ఉన్న ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటామని, ఇజ్రాయెల్ దేశం సైనిక చర్యకు దిగితే స్పందన మరింత కఠినంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ వివాదంలో అమెరికా దేశం దూరంగా ఉండాలని ఐక్య రాజ్య సమితి సూచించింది.