పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) విదేశీ భూభాగమని పాకిస్తాన్ అంగీకరించింది. ఇదే విషయాన్ని ఆ దేశంలోని హైకోర్టుకు తెలిపింది. పీవోకేకు చెందిన కవి, జర్నలిస్ట్ అహ్మద్ ఫర్హాద్ షా కిడ్నాప్ కేసులో కోర్టులో పాకిస్తాన్ ఆ విషయాన్ని స్పష్టం చేసింది
విధాత, హైదరాబాద్ : పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) విదేశీ భూభాగమని పాకిస్తాన్ అంగీకరించింది. ఇదే విషయాన్ని ఆ దేశంలోని హైకోర్టుకు తెలిపింది. పీవోకేకు చెందిన కవి, జర్నలిస్ట్ అహ్మద్ ఫర్హాద్ షా కిడ్నాప్ కేసులో కోర్టులో పాకిస్తాన్ ఆ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ పరిణామం పీవోకే తమ అంతర్భాగమని ఎప్పటి నుంచో భారత్ చేస్తున్న వాదనకు మద్దతుగా నిలబడింది. వివరాల్లోకి వెళితే పీవోకేపై పాకిస్తాన్ ప్రభుత్వం పెత్తనం, ఆ దేశ ఆర్మీ మోహరింపునకు వ్యతిరేకంగా పలు ఉద్యమాల్లో అహ్మద్ ఫర్హాద్ షా గళమెత్తారు. ఈ నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదవ్వగా, మే 15న ఇంటి నుంచి ధీర్కోట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా అహ్మద్ ఫర్హాద్ షా భార్య తన భర్తను పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కిడ్నాప్ చేసిందని ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఫర్హాద్ షాను కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి మొహ్సిన్ అక్తర్ కయానీ ఆదేశించారు. ఈ కేసులో పాకిస్తాన్ అదనపు అటార్నీ జనరల్ శుక్రవారం ప్రభుత్వం తరుఫున కోర్టులో వాదించారు. పీవోకేలోని పోలీస్ కస్టడీలో ఫర్హాద్ షా ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. సొంత రాజ్యాంగం, సొంత కోర్టులున్న పీవోకే విదేశీ భూభాగమని చెప్పారు. దీనిపై పాకిస్తాన్కు ఎలాంటి అధికార పరిధి లేదని ఆయన పేర్కోన్నారు. పీవోకేలోని పాకిస్తాన్ కోర్టుల తీర్పులను విదేశీ కోర్టుల తీర్పులుగా పరిగణిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో అహ్మద్ ఫర్హాద్ షాను ఇస్లామాబాద్ హైకోర్టు ముందు తాము హాజరు పరచలేమని కోర్టుకు వెల్లడించారు.
పాకిస్తాన్ అదనపు అటార్నీ జనరల్ వాదనలపై ఇస్లామాబాద్ హైకోర్టు న్యాయమూర్తి మొహ్సిన్ అక్తర్ కయానీ మండిపడ్డారు. పీవోకే విదేశీ భూభాగమైతే పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ రేంజర్లు ఆ భూమిలోకి ఎలా ప్రవేశించారని ఆయన ప్రశ్నించారు. పాకిస్తాన్ గూఢచార సంస్థలు పీవోకే ప్రజలను బలవంతంగా అపహరించే పద్ధతిని కొనసాగిస్తున్నాయని న్యాయమూర్తి కయానీ విమర్శించినట్లు పాక్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.