పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికాల మధ్య మరోసారి యుద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హర్మూజ్ మార్గంలో నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడటం..ప్రతిగా అమెరికా ఇరాన్ పై దాడులకు దిగడంతో మళ్లీ పశ్చిమాసియాలో యుద్ద పరిస్థితులు జోరందుకున్నాయి. అమెరికా – ఇరాన్ పరస్పర దాడులతో గల్ఫ్ దేశాల్లో సైరన్ల మోత మోగుతోంది. తాజా దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో కాల్పుల విరమణ సీజ్ ఫైర్ డీల్ ముగిసిందని పేర్కొన్నారు. నాటో కూటమి శిఖరాగ్ర సమావేశం కోసం ట్రంప్ తుర్కియేలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఇరాన్ పాలకులపై విరుచకపడ్డారు.
నౌకలపై దాడితో ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని… అలాగే ఇరాన్తో పీస్ డీల్ వద్దని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్ ప్రజలను దుర్మార్గులతో పోల్చిన ట్రంప్.. వారితో పీస్ డీల్ గురించి చర్చించడమంటే సమయం వృథా చేయడమేనని వ్యాఖ్యానించారు. మేం ఖోమెనీ అంత్యక్రియలు చేసుకోండని చెప్తే.. వారు నౌకలపై దాడులు చేశారు. అందుకే మేం బలంగా దాడులు నిర్వహించాం అని ట్రంప్ వెల్లడించారు. అయితే వారు చర్చల ప్రతిపాదనను అనుమతిస్తానని ట్రంప్ పేర్కొనడం గమనార్హం.
హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తోన్న మూడు నౌకలపై ఇరాన్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. అందుకు ప్రతిగా ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, తీరప్రాంత నిఘా వ్యవస్థలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. దీనిపై ఐఆర్జీసీ తీవ్రంగా స్పందించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అగ్రరాజ్యం ఉల్లంఘించిందని ఆరోపించింది. దీనికి తాము కూడా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి…బహ్రెయిన్, కువైట్లో అమెరికాకు చెందిన 85 సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించింది. దీంతో అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో గల్ఫ్ దేశాల్లో సైరన్ల మోత మోగుతోంది.
