Usha Chilukuri | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్( JD Vance )ను ఎంపిక చేయడంతో.. ఆయన సతీమణి ఉషా చిలుకూరి( Usha Chilukuri ) పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ), తెలంగాణ రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని తెలియడంతో.. ఆమె గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఉషా చిలుకూరి బంధువులు విశాఖపట్టణం, చెన్నైలో ఉన్నట్లు తెలిసింది. ఉన్నత విద్యావంతులైన ఉషా చిలుకూరి తల్లిదండ్రులు అమెరికా( America ) లో స్థిరపడ్డారు. ఉషా కూడా అమెరికాలోనే జన్మించారు. అక్కడే తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారమె.
ఉషా చిలుకూరి వంశవృక్షం ఇదే.. కృష్ణా జిల్లా నుంచి దశాబ్దాల కిందటే వలస
కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలో ఉషా చిలుకూరి మూలాలు ఉన్నాయి. ఉషకు తాత వరుస అయిన చిలుకూరి రామ్మోహన్ రావు కుటుంబం ప్రస్తుతం సాయిపురం గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. అయితే రామ్మోహన్ రావు.. ఉషా పూర్వీకుల వంశవృక్షాన్ని తెలిపారు. ఉన్నత విద్యావంతులైన ఉష పూర్వీకులు కృష్ణా జిల్లా నుంచి దశాబ్దాల కిందటే ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు. సాయిపురంలో 18వ శతాబ్దంలో చిలుకూరి బుచ్చి పాపయ్య శాస్త్రి నివసించారు. ఆయన సంతానమే శాఖోపశాఖలుగా మారి.. ఉష వరకు విస్తరించింది.
1970వ దశకంలో అమెరికాకు ఉష తండ్రి..
ఉషా చిలుకూరి ముత్తాత వీరావధన్లు.. ఈయనకు రామశాస్త్రి, సూర్యానారయణ శాస్త్రి, సుబ్రహ్మణ శాస్త్రి, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణమూర్తి అనే ఐదుగురు కుమారులు ఉన్నారు. వీరంతా ఉన్నత విద్యావంతులే. పెద్ద కుమారుడు రామశాస్త్రి ఐఐటీ మద్రాసులో ప్రొఫెసర్గా పని చేశారు. దీంతో ఆయన అక్కడే స్థిరపడ్డారు. రామశాస్త్రి, బాలాత్రిపుర సుందరి దంపతులకు అవధాని, నారాయణ శాస్త్రి, రాధాకృష్ణ, శారద సంతానం. ఇక ముగ్గురు కుమారులు అమెరికాలో స్థిరపడగా, శారద చెన్నైలో నివాసముంటున్నారు. రామశాస్త్రి మూడో కుమారుడు రాధాకృష్ణ 1970వ దశకంలో అమెరికాకు వలస వెళ్లారు. వారు శాన్ డియాగోలో ఇంజనీరింగ్, మాలిక్యులర్ బయాలజీ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. ఆయన పామర్రుకు చెందిన లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. రాధాకృష్ణ, లక్ష్మి సంతానమే ఉషా చిలుకూరి.
చెన్నైలో నివాసముంటున్న ఉషా వాన్స్ మేనత్త
ఉషా చిలుకూరి మేనత్త శారద చెన్నైలో నివాసం ఉంటున్నారు. ఉషా తండ్రి రాధాకృష్ణ సోదరినే శారద. ఉష భర్త జేడీ వాన్స్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక కావడంతో శారద హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మా పూర్వీకులు తణుకు సమీపంలోని ఒడ్డూరులో ఉండేవారని గుర్తు చేశారు. మా తాత కూడా ఉద్యోగి. ఉద్యోగం రీత్యా వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. మా నాన్న చెన్నైలో ఉద్యోగం చేశారు. నేను, మా అన్న (ఉష తండ్రి రాధాకృష్ణ) కూడా అక్కడే పుట్టాం. ఒడ్డూరుతో సంబంధాలు తక్కువ. తొలినాళ్లలో బంధువుల ఇంట్లో కార్యక్రమాలకు వెళ్లినట్లు గుర్తు ఉందంతే. మా అన్న చెన్నైలో చదువుకుని అమెరికాలో స్థిరపడ్డారు. మేం చెన్నైలో ఉంటున్నాం. మా అన్నయ్య కుటుంబం, ఉషా కుటుంబంతో మాకు అనుబంధం ఉంది. ఉషా, ఆమె భర్త ఈ స్థాయికి చేరడం మా కుటుంబమంతటికీ గర్వకారణం. మరింత ఉన్నతస్థాయికి చేరాలని ఆశిస్తున్నాం. ఉషా చాలా తెలివైన పిల్లని, జేడీ వాన్స్ ఈ స్థాయికి చేరడంలో ఆమె పాత్ర ఉందని శారద అన్నారు.
విశాఖపట్నంలోనూ ఉషా చిలుకూరి బంధువులు..
ఉషా చిలుకూరికి విశాఖపట్నంలోనూ బంధువులు ఉన్నారు. 96 ఏండ్ల ప్రొఫెసర్ శాంతమ్మకు ఉషా చిలుకూరి వరుసకు మనువరాలు అవుతారు. శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈయన ఉషా చిలుకూరి తాత రామశాస్త్రి సోదరుడు. సుబ్రహ్మణ శాస్త్రి తెలుగు ప్రొఫెసర్గా పని చేసి, కొన్నేళ్ల క్రితం మరణించారు. శాంతమ్మ గతేడాది వరకు విశాఖ నుంచి విజయనగరంలోని సెంచూరియన్ యూనివర్సిటీలో ఫిజిక్స్ బోధించడానికి వెళ్లేవారు. ప్రస్తుతం పరిశోధక విద్యార్థులకు మార్గదర్శనం చేయాలని భావిస్తున్నారు. ఉషతో తనకు పెద్దగా కమ్యూనికేషన్ లేదని, ఎప్పుడన్నా ఒకసారి ఆమెతో చాట్ చేస్తుంటానని ప్రొఫెసర్ శాంతమ్మ వెల్లడించారు. జేడీ వాన్స్ను రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్ధిగా ప్రకటించిన విషయం టీవీలో చూసిన వెంటనే తాను ఉషకు ఫోన్ చేసి అభినందనలు తెలిపినట్లు శారద వెల్లడించారు.
జేడీ వాన్స్, ఉషా చిలుకూరిది ప్రేమ వివాహం..
ఉషా చిలుకూరి ఇటీవలే ఒక ప్రసంగంలో తన జీవిత విశేషాలను వెల్లడించారు. తాను శాన్ డియాగోలోని ఒక మిడిల్ క్లాస్ కమ్యూనిటీలో పెరిగానని స్పష్టం చేశారు. తన తల్లిదండ్రులు భారత్ నుంచి వలస వచ్చారని, తనకు ఒక సోదరి ఉందని ఆమె తెలిపారు. లా చదివేటప్పుడు జేడీ వాన్స్ను కలుసుకున్నానని, అప్పటి నుంచి ఇప్పటివరకు తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అతనేనని ఉషా అన్నారు. 2013లో యేల్ లా స్కూల్లో జేడీ వాన్స్ను తొలిసారి కలిసినట్లు చెప్పారు. ‘సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికా’’ అనే అంశంపై జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. అక్కడ ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2014లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఉషా, జేడీ వాన్స్ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇవాన్, వివేక్, మీరాబెల్ వారి పేర్లు. ఉషా హిందూ సంప్రదాయంలో పెరగగా, జేడీ వాన్స్ క్యాథలిక్ మతాన్ని అనుసరిస్తారు.