సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ విమానం అకస్మాత్తుగా తీవ్రమైన కుదుపులకు లోనయి ఒక ప్రయాణికుడు మరణించడం అనేక మందికి గాయాలు కావడం తెలిసిందే.
న్యూఢిల్లీ: సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ విమానం అకస్మాత్తుగా తీవ్రమైన కుదుపులకు లోనయి ఒక ప్రయాణికుడు మరణించడం అనేక మందికి గాయాలు కావడం తెలిసిందే.ఈ ఘటనలో 73 ఏళ్ల బ్రిటిష్ ప్రయాణికుడు మృతి చెందారు. ముప్పైమంది గాయపడ్డారు. ప్రయాణికుని మృతిపట్ల బోయింగ్ సంతాపం తెలియజేసింది. బోయింగ్ విమానాలకు మంచి పేరుంది. ప్రపంచంలో అత్యధికంగా గగనతలాన్ని ఏలుతున్నది బోయింగ్ విమానమే.
అయినా ఇటీవల బోయింగ్ విమానాల సామర్థ్యంపై వివాదం చెలరేగింది. బోయింగ్ విమానాల్లో లోపాలున్నాయని ఆ కంపెనీలో పనిచేసి బయటికి వచ్చిన ఒక ఇంజనీరు వ్యాఖ్యానాలు చేయడం, ఆ ఇంజనీరు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం తెలిసిందే. బోయింగ్ విమానాల రెక్కలు వాటంతట అవే తెరుచుకున్న సందర్భాలు కూడా ఇటీవల వెలుగులోకి వచ్చాయి. సుమారు పదివేల బోయింగ్ విమానాలు సర్వీసులో ఉన్నాయని ఆ సంఖ్యతో చూసినప్పుడు ఈ ఫిర్యాదులు అల్పమైనవని నిపుణులు చెబుతున్నారు. బోయింగ్ కూడా దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నది.
ప్రపంచంలో 90 శాతం కార్గో విమానాలు కూడా బోయింగ్వే నడుస్తున్నాయి. సింగపూర్ బోయింగ్ విమానం ఒక్కసారిగా ఆరువేల అడుగులకు జారిపోవడం వల్ల ఈ కుదుపులు ఏర్పడ్డాయని ఒక ప్రయాణికుడు చెప్పారు. అకస్మాత్తుగా విమానం కిందికి జారడం, సీటు బెల్టులు పెట్టుకోని ప్రయాణికులు ఎగిరి విమానం కప్పుకు డీకొట్టడం, అంతా చెల్లాచెదరుగా పడడం జరిగిందని ఆ ప్రయాణికుడు తెలిపారు. కొందరు ప్రయాణికులు లగేజీ బాక్సులను డీకొన్నారని, వారికి తీవ్రగాయాలయ్యాయని ఆయన తెలిపారు.