స్పీకర్ గడ్డం ప్రసాద్ కు హరీష్ రావు ఘాటు లేఖ

శాసనసభ నిబంధనలకు తిలోదకాలిస్తున్నారని.. అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పును బేఖాతార్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఘాటు లేఖ రాశారు.

విధాత, హైదరాబాద్ : శాసనసభ నిబంధనలకు తిలోదకాలిస్తున్నారని.. అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పును బేఖాతార్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఘాటు లేఖ రాశారు.

తెలంగాణ శాసనసభ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుభాకాంక్షలు చెబుతునే…ఈ రెండేళ్ల కాలంలో అసెంబ్లీ నిర్వహణలో చోటుచేసుకున్న తీవ్రమైన వైఫల్యాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఆయన లేఖలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రతిష్టను, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో జరుగుతున్న పొరపాట్లను హరీష్ రావు తన లేఖలో ఎత్తి చూపారు. సభా నిర్వాహణలో అనుసరించాల్సిన అంశాలపై పలు కీలక సూచనలు చేశారు.

యధేచ్చగా సభా నిబంధనల ఉల్లంఘనలు

శాసనసభ పనిదినాలు గణనీయంగా తగ్గిపోవడం పట్ల హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. రూల్ 12 ప్రకారం సభా కార్యకలాపాలకు అవసరమైనన్ని రోజులు సభను నిర్వహించాల్సి ఉన్నా, అది జరగడం లేదని పేర్కొన్నారు. అలాగే, సరైన కారణాలు లేకుండా సభను తరచుగా, హఠాత్తుగా వాయిదా వేయడం సభా సమయానికి సంబంధించిన రూల్ 13 తోపాటు వాయిదా పద్ధతులకు సంబంధించిన రూల్ 16 లకు విరుద్ధమని గుర్తు చేశారు.

ప్రశ్నలు..జవాబుల పద్దతి నిర్వీర్యం

సభలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సభ్యులకు ఉన్న ప్రధాన క్వశ్చన్ అవర్, జీరో అవర్ నిర్వహణలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రూల్స్ 38 నుంచి 52, అదేవిధంగా రూల్స్ 53 నుంచి 62 వరకు ఉన్న నిబంధనలను పాటించడం లేదని ఆరోపించారు. సభలో మంత్రుల నుంచి నేరుగా సమాధానం వచ్చే స్టార్డ్ క్వశ్చన్స్ చర్చకు రాకుండా చేస్తున్నారని, తద్వారా రూల్ 38 కల్పించిన ప్రశ్నల సమయ హక్కును కాలరాస్తున్నారని పేర్కొన్నారు.

సభలో ఒక ప్రశ్నకు సంబంధించి లోతుగా చర్చించేందుకు, ప్రభుత్వం నుండి స్పష్టత తీసుకునేందుకు సభ్యులకు ఉండే సప్లిమెంటరీ క్వశ్చన్స్ అవకాశాన్ని నిరాకరించడం, కుదించడం రూల్ 50 ప్రధాన ఉద్దేశానికి విఘాతం కలిగించడమేనని అన్నారు. ప్రజా సమస్యలను తక్షణమే ప్రస్తావించే జీరో అవర్‌ను కూడా ప్రతిసారి కుదించడం సభా హక్కులను దెబ్బతీయడమేనని స్పష్టం చేశారు.

అన్ స్టార్డ్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోవడం.. రూల్ 39 ప్రకారం వీటికి లిఖితపూర్వక సమాధానాలు సభలో ప్రవేశపెట్టాలని.. అలాగే రూల్ 41 ప్రకారం నిర్ణీత గడువులోగా సభ్యులకు ఆ సమాధానాలు అందజేయాలని…కానీ ఈ నిబంధనలను పాటించకపోవడం వల్ల సభ జవాబుదారీతనం లోపించిందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.

రెండేళ్లు గడిచినా హౌస్ కమిటీల ఊసే లేదు

గత రెండేళ్లుగా అసెంబ్లీలో హౌస్ కమిటీలను ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమని హరీష్ రావు తన లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం (రూల్ 196, 198) కమిటీలను కచ్చితంగా నియమించాల్సి ఉన్నా, ప్రభుత్వం ఆ పని చేయడం లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసినా, కమిటీల పని మాత్రం ఆగకూడదని రూల్ 227 స్పష్టంగా చెబుతోందని, కానీ అసలు కమిటీలే లేకపోవడం వల్ల ప్రభుత్వ పనితీరుపై పర్యవేక్షణే లేకుండా పోయిందని ఆయన తెలిపారు.

అలాగే, ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ రాజీనామా చేసినప్పటికీ, ఆ కమిటీని తిరిగి ఏర్పాటు చేయలేదని గుర్తుచేశారు. కమిటీల పని ఎప్పుడూ ఆగకూడదని, సమావేశాలకు సరిపడా సభ్యులు ఉండాలని రూల్స్ 199, 201 చెబుతున్నా.. వీటిని పట్టించుకోకపోవడం వల్ల కమిటీల వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

డిప్యూటీ స్పీకర్ నియామకం గాలికి..

డిప్యూటీ స్పీకర్ నియామకం జరగకపోవడం మరో ప్రధాన ఉల్లంఘన అని, రూల్ 8 ప్రకారం డిప్యూటీ స్పీకర్‌ను తప్పనిసరిగా ఎన్నుకోవాల్సి ఉంటుందని హరీష్ రావు గుర్తుర చేశారు. సభలో సభ్యుల హక్కులను పరిరక్షించే ప్రివిలేజ్ కమిటీకి డిప్యూటీ స్పీకరే చైర్మన్‌గా వ్యవహరిస్తారు కాబట్టి, ఆ పదవి ఖాళీగా ఉండటం వల్ల కమిటీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందన్నారు. ఫలితంగా, సభ్యుల హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అనేక ఫిర్యాదులు పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్నాయని, ఇది రూల్ 256 మరియు 257 లకు విరుద్ధమని స్పష్టం చేశారు.

ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును బేఖాతార్

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడమే అత్యంత ఆందోళనకరమైన విషయమని హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. శాసనసభ (ఫిరాయింపుల నిరోధక) నిబంధనలు-1986, ముఖ్యంగా రూల్స్ 3 నుండి 7 ప్రకారం.. విచారణ జరిపి, నోటీసులు జారీ చేసి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా.. తీసుకోకపోవడం శోచనీయం. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2) కు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు.

గతంలో మణిపూర్ రాష్ట్రానికి చెందిన కైశం మేఘచంద్ర సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఫిరాయింపు పిటిషన్లపై నిర్ణీత గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా హెచ్చరించినప్పటికీ, ఆ తీర్పును పట్టించుకోకపోవడం రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, తక్షణమే అసెంబ్లీ నిర్వహణలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

స్పీకర్ కు కీలక సూచనలు

లేఖలో హరీష్ రావు అసెంబ్లీ స్పీకర్ కు పలు సూచనలు చేశారు. ఏడాదికి కనీసం 30 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలని, ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ నిర్వహణను సరిదిద్దాలని, అన్-స్టార్డ్ ప్రశ్నలకు గడువులోగా సమాధానాలు ఇవ్వాలని సూచించారు. అన్ని హౌస్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలి.
డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలని, ప్రివిలేజ్ కమిటీని పునరుద్ధరించి పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరారు. సభలో నిబంధనలు, హుందాతనాన్ని పాటించాలని, పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై రాజ్యాంగం, చట్టం తోపాటు న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలని హరీష్ రావు కోరారు.

 

Latest News