Artificial Intelligence Summit । 200 ఎకరాల్లో ప్రతిష్ఠాత్మకంగా ఏఐ సిటీ.. ఎక్కడో తెలుసా?

ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేధస్సుతో పని అనే ఇతివృత్తంతో గురు, శుక్రవారాలు రెండు రోజుల పాటు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో సదస్సు నిర్వహిస్తున్నారు. దేశంలోనే మొదటి సారిగా గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు.

Reported by: Jagan Mohan Talluri | Latest News | Sep 04, 2024, 8:04 pm IST
Read Time: 5 mins
Artificial Intelligence Summit । 200 ఎకరాల్లో ప్రతిష్ఠాత్మకంగా ఏఐ సిటీ.. ఎక్కడో తెలుసా?

Artificial Intelligence Summit । ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేధస్సుతో  పని (Making AI work for every one) అనే ఇతివృత్తంతో  గురు, శుక్రవారాలు రెండు రోజుల పాటు  హైదరాబాద్  ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో  సదస్సు నిర్వహిస్తున్నారు. దేశంలోనే మొదటి సారిగా గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ సదస్సును ప్రారంభిస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి AI రంగంలో పేరొందిన ప్రముఖులు, సంస్థల ప్రతినిధులు 2000 మంది ఈ సదస్సు లో పాల్గొంటున్నారు. ఏఐ రంగంలో అందరి దృష్టి ని ఆకర్షిస్తున్న ఖాన్ అకాడమీ అధినేత సల్ ఖాన్, IBM నుంచి డానియెలా కాంబ్, XPRIZE ఫౌండేషన్ పీటర్ డయామండిస్ తదితర ప్రముఖులు ఈ సదస్సు కు హాజరవుతారు. ఏఐ రంగం అభివృద్ధి కి తమ ఆలోచనలను పంచుకుంటారు. భవిష్యత్తు అవకాశాలు, కొత్త ఆవిష్కరణలపై చర్చలు  జరుపుతారు. సామాజిక బాధ్యత గా సమాజం పై AI ప్రభావం, నియంత్రణ,  సవాళ్ల ను చర్చిస్తారు.

కొత్త సాంకేతికత పరిజ్ఞానం తో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్ది దశలో ఉన్న వినూత్న ప్రాజెక్ట్‌లను ఈ సదస్సు లో ప్రదర్శిస్తారు. రెండు రోజుల ఈవెంట్‌లో ప్రధాన వేదిక తో పాటు నాలుగు అదనపు వేదిక లు ఏర్పాటు చేశారు.  అన్ని వేదికలపై AI కి  సంబంధించి వేర్వేరు అంశాలపై చర్చలు, ఇష్టాగోష్టి సెషన్స్ నిర్వహించే ఏర్పాట్లు చేశారు. హై-ప్రొఫైల్ ప్యానెల్ డిస్కషన్స్,  ఇంటరాక్టివ్ సెషన్‌ లు ఏర్పాటు చేశారు. ఐటీ రంగంలో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు నిర్వహిస్తోంది. హైదరాబాద్ లో నిర్మించనున్న ఫోర్త్ సిటీ లో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్ఠాత్మకంగా AI సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం, అందుకు రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణాన్ని ఈ AI గ్లోబల్ సదస్సు ప్రపంచానికి చాటి చెపుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రాన్ని AI హబ్ గా తీర్చి దిద్దేందుకు.. ప్రపంచ దిగ్గజ సంస్థల  పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో AI సేవలను అబివృద్ధి అవకాశాల తో.. భవిష్యత్తు కార్యాచరణ తో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రోడ్ మ్యాప్ ను  రూపొందించింది.  దాదాపు 25 కార్యక్రమాలను ఇందులో పొందుపరిచారు. AI గ్లోబల్ సదస్సులో ముఖ్యమంత్రి ఈ రోడ్ మ్యాప్ ను విడుదల చేస్తారు