high interest loans । అధిక వడ్డీకి 31,795 కోట్ల మేర రుణాలు.. వాటి వడ్డీ రేట్లు తగ్గించండి.. నిర్మలా సీతారామన్‌కు భట్టివిక్రమార్క వినతి

గత ప్రభుత్వం చేసిన బడ్జెటేతర రుణాలు రాష్ట్ర ఖజనాపై తీవ్ర రుణ భారాన్ని మోపుతున్నాయని, వీటిని రీ షెడ్యూల్ చేసి కొంత ఉపశమనం కలిగించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు

high interest loans । అధిక వడ్డీకి 31,795 కోట్ల మేర రుణాలు.. వాటి వడ్డీ రేట్లు తగ్గించండి.. నిర్మలా సీతారామన్‌కు భట్టివిక్రమార్క వినతి

high interest loans । గత ప్రభుత్వం చేసిన బడ్జెటేతర రుణాలు రాష్ట్ర ఖజనాపై తీవ్ర రుణ భారాన్ని మోపుతున్నాయని, వీటిని రీ షెడ్యూల్ చేసి కొంత ఉపశమనం కలిగించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. శనివారం ఢిల్లీలో నిర్మలా సీతారామన్ ను కలిసిన తరువాత భట్టి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం రూ. 31,795 కోట్ల మేర అధిక వడ్డీకి రుణాలు చేసిందని, వాటి వడ్డీ రేట్లు తగ్గించాలని కోరానన్నారు.  జీతాల కంటే ఎక్కువ మొత్తం అప్పులపై వడ్డీకే కట్టాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను కేంద్ర మంత్రికి వివరించి సహాయం అందించాలని కోరానన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల విడుదలతో పాటు విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధుల గురించి గుర్తు చేశానన్నారు.  మొత్తం 8 అంశాలను కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకు వెళ్ళానని తెలిపారు. విద్యుత్ విషయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి రావాల్సిన నిధుల గురించి మాట్లాడానన్నారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు  గత కొన్ని ఏళ్లుగా రాష్ట్రానికి రావాల్సిన బకాయి నిధులు ఇవ్వాలని కోరానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కేంద్ర ప్రభుత్వాధికారులకు సమావేశాన్ని ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటామని  కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తనకు చెప్పారన్నారు.

 

చట్ట ప్రకారమే  ఎన్ కన్వెన్షన్  సెంటర్ కూల్చివేత

చట్ట ప్రకారమే  ఎన్ కన్వెన్షన్  సెంటర్ కూల్చివేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరం అంటేనే లేక్స్, రాక్స్ (సరస్సులు, రాళ్లు) అని, వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. చెరువులు ఏవీ ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిందే హైడ్రా అని చెప్పారు. దీన్ని ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారని తెలిపారు. ప్రతి పనికీ నోటీసులు ఇచ్చి ఆపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైడ్రా అధికారులు, సిబ్బంది బఫర్ జోన్ లో కాదు, నేరుగా చెరువులోనే కఠిన నిర్మాణాలను కూల్చేస్తున్నారన్నారు.
శాటిలైట్ ఫోటోల ద్వారా విభజనకు ముందు, విభజన తర్వాత ఈ 10 ఏళ్లలో చెరువులు ఎంత మేర ఆక్రమణకు గురయ్యాయి తెలుసుకుంటున్నామని భట్టి అన్నారు. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఫోటోలను తీసి, అంతకుముందు ఎన్ని చెరువులు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అన్నది ప్రజల ముందు పెడతామన్నారు. చట్ట ప్రకారం, చట్టానికి లోబడి మాత్రమే  తమ ప్రభుత్వం చర్యలు చేపడతున్నదని భట్టి చెప్పారు.