Jabardasth|మరి కొద్ది రోజులలో ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారం మరింత వేడెక్కిస్తున్నారు. మరోసారి గెలవాలని జగన్ ప్రభుత్వం గట్టిగా ముందుకెళుతుంటే, ఈ సారైన అధికారం చేజెక్కించుకోవాలని టీడీపీ కూటమి భావిస్తుంది. అయితే గత ఎన్నికలలో ఘోర పరాజయం చవిచూసిన జనసేన ఈ సారి మాత్రం తమకు కేటాయించిన సీట్లలో మంచి విజయాలు సాధించాలనే కసి మీద ఉంది. ఈ క్రమంలో జనసేన పార్టీ అభ్యర్ధుల పక్షాన ఎన్నికల్లో ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెయినర్లను కూడా నియమించారు. తాజాగా జనసేన స్టార్ క్యాంపెయినర్స్ వీరేనంటూ జనసేన ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.
ఇందులో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు, అంబటి రాయుడు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, మొగలిరేకులు సీరియల్ ఫేమ్ సాగర్ (ఆర్కే నాయుడు), కమెడియన్ పృథ్వీ, కమెడియన్ హైపర్ ఆది, కమెడియన్ గెటప్ శ్రీను ఉన్నారు. ఓవైపు జగన్.. ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లు అని ప్రచారం చేసుకుంటూ ముందుకు పోతుండగా, పవన్ కళ్యాణ్ జబర్దస్త్ కమెడియన్లను స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించడంతో వైసీపీ వాళ్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. జబర్ధస్త్ కమెడీయన్స్తో మీ ప్రచారాలా, గెలిచినట్టేలే అంటూ కొందరు సెటైర్స్ వేస్తున్నారు. ఇక మచిలీపట్నం పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కమిటీని పవన్ కల్యాణ్ ప్రకటించారు. బండి రామకృష్ణ కార్యదర్శిగా, సభ్యులుగా అక్కల రామ్మోహన రావు (గాంధీ), పంచకర్ల సందీప్, బోనీ పార్వతి, చిలకలపూడి పాపారావు, బాడిత శంకర్, అజయ్ వర్మ ఠాకూర్ కొనసాగుతారని స్పష్టం చేశారు.
స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు.. మొన్నటి వరకూ వైసీపీ కోసం పని చేశారు. జగన్ని కూడా కలిసారు.. గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు కూడా వచ్చాయి. అయితే అక్కడ తనకి టిక్కెట్ దక్కని పక్షంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ని కలిసి ఆ పార్టీ కోసం పని చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. జనసేనలోను అంబటి రాయుడు ఉండడని ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయనని జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ప్రకటించడంతో.. ప్రస్తుతానికి ఆయన జనసేనలో ఉన్నట్టు అర్దమవుతుంది. ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థుల తరఫున వీరు ఎన్నికల్లో ప్రచారం చేస్తూ ఎంత వరకు ఓట్లు రాబడతారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.