KTR| పదేండ్ల అభివృద్ధి పాలనకు.. రెండేళ్ల అరాచక పాలనకి మధ్య ఎన్నిక ఇది : కేటీఆర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పదేండ్ల బీఆర్ఎస్ అభివృద్ధి పాలనకి, రెండేళ్ల కాంగ్రెస్ అరాచక పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నిక అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఎన్నిక పార్టీల మధ్యలో జరుగుతున్న ఎన్నిక కాదు, ఈ ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల ఎన్నిక కాదన్నారు.

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By-election) పదేండ్ల బీఆర్ఎస్( BRS) అభివృద్ధి పాలనకి, రెండేళ్ల కాంగ్రెస్ (Congress) అరాచక పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నిక అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అభివర్ణించారు. జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఎన్నిక పార్టీల మధ్యలో జరుగుతున్న ఎన్నిక కాదు, ఈ ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల ఎన్నిక కాదు అన్నారు. పదేండ్ల రైతుబంధు పాలనకు, రెండేళ్ల రాక్షస పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నిక అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్(Maganti Sunitha Gopinath) నామినేషన్ కు ముందు భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో కేటీఆర్ మాట్లాడారు. కేసీఆర్ ఆధ్వర్యంలో మరోసారి పాలన రావడానికి, హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక పునాది కాబోతున్నదని… మరోసారి రాష్ట్రంలో గులాబీ పార్టీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం కాబోతుందన్నారు. అన్ని వర్గాల మద్దతుతో, అండతో మా పార్టీ అభ్యర్థి సునీత ఘన విజయం సాధించబోతుందన్నారు. రెండు సంవత్సరాల ఈ విఫల కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరూ మా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్‌లో ప్రతి ఒక్కరికి, నియోజకవర్గానికి విశేషమైన సేవలు అందించిన గోపీనాథ్ సేవలు గుర్తు తెచ్చుకుని సునీతను గెలిపించాలని కేటీఆర్ కోరారు.

సునీత గెలిస్తేనే కాంగ్రెస్ హామీల అమలు

జూబ్లీహిల్స్‌లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలోని కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారన్నారని కేటీఆర్ అన్నారు. సునీత గెలిస్తే ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.2500 ఇస్తుందని, లక్షల మంది రైతులకు రైతుబంధు వస్తుందని ఆశిస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, తర్వాత మోసపోయిన యువతి యువకులు కూడా సునీత గెలుపు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. తమ ఇళ్లు కూలగొట్టిన అరాచకాలను చూసిన తర్వాత, ఈ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి గెలవాలని, ఆ అరాచకాలు ఆగాలని హైదరాబాద్ నగర పేదలు చూస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. మూతపడుతున్న బస్తీ దావఖానాలు, ఉచిత తాగునీరు ఆగిపోతున్న విషయాలు ప్రజలందరూ చూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కూడా హైదరాబాదులో కట్టలేదు. కేసీఆర్ కట్టిన హైదరాబాద్‌లో కట్టిన లక్ష ఇళ్లు, ఇచ్చిన ఇళ్ల పట్టాలు, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా హైదరాబాద్ నగర ప్రజలకు గుర్తున్నాయన్నారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన మైనార్టీలకు ఈ ఎన్నిక ఒక అవకాశంగా భావిస్తున్నారు. ప్రభుత్వంలో ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వకుండా దారుణంగా వారిని అవమానపరిచిన మైనార్టీలు, ఈ ఎన్నికను రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి ఒక అవకాశంగా భావిస్తున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. తమకు ఇచ్చిన బీసీ డిక్లరేషన్, రిజర్వేషన్లు అన్నీ మోసమని, ఈ అంశంలో గుణపాఠం చెప్పడానికి రాష్ట్రవ్యాప్తంగా బీసీలు సిద్ధంగా ఉన్నారన్నారు. దళిత బంధు, అభయహస్తం అని చెప్పి మోసం చేసిన దళితులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. మా అభ్యర్థికి అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతుందన్నారు.