విధాత, హైదరాబాద్ :
“మొంథా” తుఫాను, భారీ వర్షాల నేపథ్యంలో ఆర్ అండ్ బీ అధికారులను మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఆర్ అండ్ బి అధికారులు ఫీల్డ్ లెవెల్ లో హై అలెర్ట్ గా ఉండాలని ఆదేశించారు. అత్యవసరం ఐతే తప్పా.. ఎవరూ సెలవు పై వెళ్లొద్దని సూచించారు. బుధవారం నాడు ఆర్ అండ్ బి ఈఎన్సి లు, సిఈ లు, ఎస్ఈ లతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. లో కాజ్ వే లు, కల్వర్టులు వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలనీ, ప్రజలను అప్రమత్తం చేయడానికి పోలీసు, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, పిఆర్ శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు.
ఆర్ అండ్ బీ ప్రధాన కార్యాలయంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్ అన్ని జిల్లాలతో అనుసంధానం చేయాలనీ, ఆర్ అండ్ బి సర్కిల్ వారిగా అన్ని జిల్లాలలో పరిస్థితులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమర్జెన్సీ ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలనీ, అందుకు తగ్గ చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. మొంథా తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరమైతేనే ప్రజలు రోడ్ల పైకి రావాలనీ, అధికారులు సూచించే జాగ్రత్తలు పాటించాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
