అమరావతి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని(Tirumala Darshan) దర్శించుకున్నారు. వరాహా స్వామి దర్శనానంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆమెకు వేదాశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారి చిత్రపటాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అందించారు.
దర్శనానంతరం పద్మావతి అతిథిగృహానికి వెళ్తూ మధ్యలో అనూహ్యంగా ప్రోటోకాల్ ను పక్కన పెట్టేసి.. కారు దిగిన రాష్ట్రపతి భక్తులతో మాట్లాడటం ఆసక్తి రేపింది. ముర్ము భక్తులతో కరచాలనం చేసి చాక్లెట్లు పంచారు. శ్రీవారి దర్శన అనంతరం ఆలయం నుంచి వెళ్తూ రాంభగీచ వసతిగృహం వద్ధ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వాహనం దిగి..ఆ మార్గంలో వెలుతున్న భక్తులను పలకరించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల పద్మావతి అతిథిగృహానికి చేరుకున్నారు. అనంతరం రాష్ట్రపతి హైదరాబాద్ కు బయలుదేరారు.
