Paddy Procurement | వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి : మంత్రి ఉత్తమ్

రాష్ట్రంలో వరి ధాన్యం, పత్తి కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలిచ్చారు.

Paddy Procurement | వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి : మంత్రి ఉత్తమ్

విధాత :
రాష్ట్రంలో వరి ధాన్యం, పత్తి కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అదనపు కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాలు, వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి, రవాణా శాఖల అధికారులతో వరి ధాన్యం,పత్తి కొనుగోలు, అకాల వర్షాల కారణంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి మాట్లాడుతూ, తుఫాను వల్ల అకాల వర్షాల నేపథ్యంలో వరి ధాన్యం, పత్తి కొనుగోలు ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉన్నాయని, ప్యాడి క్లీనర్లు, తేమ యంత్రాలు అవసరం మేరకు సమకూర్చాలని ఆదేశించారు.

రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి మాట్లాడుతూ, తుఫాను తీవ్రత అధికంగా ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాను తీవ్రత తగ్గేవరకు హార్వెస్టింగ్ ప్రక్రియ నిలిపి వేయాలని, హార్వెస్టింగ్ చేసిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు నష్టపోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి కొనుగోలు కపాస్ కిసాన్ యాప్ ద్వారా చేయడం జరుగుతుందని, ఈ యాప్ లో కౌలు రైతులు కూడా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారుల సహాయంతో వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. వరి ధాన్యం, పత్తి రైతులు తేమ శాతం నిబంధనల ప్రకారం ఉండేలా చూసుకోవాలని, తేమ శాతాన్ని పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. సరిహద్దు జిల్లాల వారు అప్రమత్తంగా ఉండాలని, బయట రాష్ట్రాల నుండి వచ్చే వరి ధాన్యం, సోయాబీన్, కందులు, పెసలు అక్రమ రవాణా జరగకుండా పర్యవేక్షించాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.

రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, వర్షాల దృష్ట్యా ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రేడ్ ఏ రకానికి క్వింటాలుకు 2 వేల 389 రూపాయలు, సాధారణ రకానికి క్వింటాలుకు 2 వేల 369 రూపాయలుగా మద్దతు ధర నిర్ణయించినట్లు, సన్న రకం వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాలుకు 500 రూపాయలు అదనంగా అందించనున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన టార్పారిన్ కవర్లను అందుబాటులో ఉంచాలని, ధాన్యం తడవకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ మాట్లాడుతూ, పత్తి కొనుగోలు ప్రక్రియ కొరకు చర్యలు చేపట్టాలని, కపాస్ కిసాన్ యాప్ లో రైతుల వివరాలు నమోదు చేసినట్లు తెలిపారు. పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పత్తి కొనుగోలు చేయాలని అధికారులను కమిషనర్ రవీంద్ర ఆదేశించారు.