వియత్నాంలో పడవ బోల్తా..15మంది మృతి

వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపంలో భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడి 15 మంది మృతి చెందారు. ఫూ క్వాక్ ద్వీపానికి సమీపంలో హోన్ మే రుట్ న్గోయ్ వద్ద 32 మంది భారతీయ పర్యాటకులు, నలుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న ఒక స్పీడ్‌బోట్ బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది.

విధాత : వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపంలో భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడి 15 మంది మృతి చెందారు. ఫూ క్వాక్ ద్వీపానికి సమీపంలో హోన్ మే రుట్ న్గోయ్ వద్ద 32 మంది భారతీయ పర్యాటకులు, నలుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న ఒక స్పీడ్‌బోట్ బోల్తా పడింది. కనీసం 15 మంది మృతి చెందినట్లు నిర్ధారణ కాగా, 21 మందిని రక్షించారు.వీరిలో కొందరిని రెస్క్యూ సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు. స్థానిక అధికారులు గాలింపు, సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మృతుల్లో ఎక్కువుగా ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు టూరిస్టులు ఉన్నారు.

కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్‌ శ్రీధర్‌, మచిలీపట్నంకు చెందిన జయశ్రీ మరణించారు. కడపకు చెందిన మరో డిస్ట్రిబ్యూటర్‌ నయీం ఒడ్డున ఉండటంతో ప్రాణాలు దక్కించుకున్నారు.తీరానికి కేవలం 400 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. బాధిత కుటుంబాలకు భారత రాయబార కార్యాలయం సహాయం అందిస్తోంది. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలిపింది.

ఓ మొబైల్‌ కంపెనీ.. భారత్‌ నుంచి తమ డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలను వియత్నాం ట్రిప్‌కు తీసుకెళ్లింది. మొత్తం 250 మంది ఈ యాత్రకు వెళ్లారు. వీరిలో ఏపీ నుంచి 35, తెలంగాణ నుంచి 40 మంది ఉన్నారు. ట్రిప్‌లో భాగంగా వీరు మూడు పడవల్లో సముద్రంలో విహార యాత్రకు వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో హాన్‌ మే రుట్‌ నుంచి అన్‌థోయ్‌ పోర్టుకు ఒక స్పీడ్‌ బోట్‌ బయల్దేరింది. అందులో 32 మంది భారతీయులు, నలుగురు సిబ్బంది ఉన్నారు.

ఈ పడవ తీరానికి 400 మీటర్ల దూరంలో ఉండగా.. సముద్రంలో ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో ప్రయాణికులు నీటిలో మునిగిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన సమీపంలోని ఇతర పర్యాటక బోట్ల నిర్వాహకులు.. అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే అలల ఉదృతి తీవ్రంగా ఉండటం, బోటు పూర్తిగా తలకిందులు కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

 

Latest News