Errabelli పాలకుర్తి పార్టీలో అసమ్మతి స్వరం అసమ్మతి నేతల రహస్య సమావేశం పార్టీ మారాలనే చర్చ కంటిమీద కునుకులేని ఎర్రబెల్లి అసమ్మతి నాయకులకు బుజ్జగింపులు? అమెరికా వెళ్ళొచ్చేసరికి అసమ్మతి శిబిరం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్లు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిస్థితి తయారైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైనా సమస్య నెలకొంటే దాన్ని పరిష్కరించాల్సిన ప్రముఖ స్థానంలో ఉన్న మంత్రికే ఇప్పుడు ఇబ్బందులు ఎదురుకావడంతో ఎవరికి […]
Errabelli
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్లు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిస్థితి తయారైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైనా సమస్య నెలకొంటే దాన్ని పరిష్కరించాల్సిన ప్రముఖ స్థానంలో ఉన్న మంత్రికే ఇప్పుడు ఇబ్బందులు ఎదురుకావడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది.
నిన్నటి వరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గంలో తనకు ఎదురులేదనే ధీమాతో ఉన్నారు. కానీ, అనూహ్యంగా సొంతపార్టీలోనే కొందరు అసమ్మతి స్వరం వినిపించడంతో ఇప్పుడు అయోమయంలో పడిపోయారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎర్రబెల్లితో పాటు సత్యవతి రాథోడ్ కూడా మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.అధిష్టానంతో ఉన్న సన్నిహిత సంబంధాలు, ఇతరత్రా అనేక కారణాలతో సత్యవతి కంటే ఎర్రబెల్లి మాట ఎక్కువగా చెల్లుబాటవుతూ వస్తుందనే అభిప్రాయం నిన్నటి వరకు వరంగల్ ఉమ్మడి జిల్లా పార్టీవర్గాల్లో ఉండేది.
ఈ జిల్లా పరిధిలోని ఏ అసెంబ్లీ సెగ్మెంట్లోనైనా ప్రభుత్వపరమైన, పార్టీ పరమైన ఇబ్బందులు తలెత్తితే ఎర్రబెల్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారనే అభిప్రాయం ఇటీవల వరకు ఉండేది. ఎమ్మెల్యేగా తాను ప్రాతినిధ్యంవహిస్తున్న పాలకుర్తిలో ఆయనకు ఎదురులేదనే విశ్వాసం మొన్నటి వరకూ అందరిలో ఉండేది. అటు పాలకూర్తి సెగ్మెంట్లో ప్రత్యర్ధి పార్టీలు సైతం బలహీనంగా ఉన్నాయనే అభిప్రాయం నిన్నటి దాకా ఉంది.
పాలకుర్తిలో అసమ్మతి స్వరం
పాలకుర్తిలో బీఆరెస్ లో నెలకొన్న తాజా పరిణామాలు ఒక్కసారిగా ఎర్రబెల్లి పై ఉన్న నమ్మకాన్ని తలకిందులు చేశాయి. మంత్రి ఎర్రబెల్లి తీరుకు నిరసగా బీఆర్ఎస్ లోని ముఖ్యనాయకులు రహస్యంగా సమావేశం కావడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ‘అంతనుకున్నామూ ఇంతనుకున్నామూ గానీ అయ్యగారి పరిస్థితి’ కూడా అంత బాగా లేదని తేలిపోయిందని పార్టీలో ఆయన ప్రత్యర్థులు సెటైర్లు వేస్తుండగా, ఎర్రబెల్లి అనుచరుల్లో సైతం కొత్త గుబులు రేకెత్తుతోంది.
దీనికి తోడు తనకు ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీయే లేదని భావిస్తూ వచ్చారు. కానీ, అనుహ్యంగా తెరపైకి ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి తెరపైకి వచ్చారు. ఈ కుటుంబంతో ఎర్రబెల్లికి పాత పరిచయాలు ఉన్నాయి. తన సహాయ,సహకారం గతంలో తీసుకున్నట్లు పాలకుర్తి నియోజకవర్గంలో జోరుగా చర్చసాగుతోంది. ఈ విషయం మంత్రిని కలవరపరస్తున్నట్లు ఆయన సన్నిహితవర్గాలు చెప్పుకుంటున్నాయి.
రహస్య సమావేశంతో మంత్రి కలవరం
ఒక్కసారిగా పాలకుర్తి నియోజకవర్గంలో మారిన పరిస్థితిల్లో అసమ్మతి నాయకుల రహస్య సమావేశం మంత్రిని కలవరానికి గురిచేస్తున్నాయి. అసమ్మతి వాదుల్లో పాత కాంగ్రెస్ నాయకులూ, మంత్రి అంటే అసంతృప్తితో ఉంటూ అదునుకోసం ఎదురుచూస్తున్న వారు ఉన్నారు. వీరంతా ఒక్కటైతే రానున్న ఎన్నికల్లో ఎర్రబెల్లి ఎదురీదక తప్పదనే గట్టి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశంలో ఉద్యమకారులు ఉన్నారు.
కాకిరాల హరిప్రసాద్, రామసహాయం కిషోర్ రెడ్డి, పొనుగోటి సోమేశ్వర్ రావు, పలువురు సీనియర్ నాయకులతో పాటు జడ్పీటీసీ, ఇద్దరు ఎంపీపీలు, 30 మంది సర్పంచ్ లు 30 మంది గ్రామ పార్టీ అధ్యక్షులు పాల్లొన్నట్లు సమాచారం. ఎర్రబెల్లి తీరుకు వ్యతిరేకంగా పార్టీ మారాలని భావించినట్లు చెబుతున్నారు. తాజా ఎర్రబెల్లి అమెరికా పర్యటన పూర్తి చేసేలోపు ఈ పరిణామాలు జరగడంతో ఆయనకు కంటిమీద కునుకులేనట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆరునెలలుగా అలుపులేకుండా
నిజానికి గత ఆరునెలలుగా మంత్రి ఎర్రబెల్లి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తిలో కాలికిబలపం కట్టుకుని తిరుగుతున్నారని చెప్పవచ్చు. ఎన్నికల ఏడాది కావడంతో తనకున్న గత రాజకీయ అనుభవం, ప్రస్తుతం రాష్టమంత్రి వర్గంలో కీలక పాత్ర పోషిస్తున్నందున ఈ దఫా గెలిచి తన ప్రతిష్టను నిలబెట్టుకోవాలని ఆశిస్తూ వచ్చారు.
ఈ మేరకు ముందస్తుగా నియోజకవర్గంలో పట్టుసడలకుండా రోజుకు ఒక రౌండ్ వేస్తూ సుడిగాలి పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలతో హోరెత్తించారు. ముఖ్యంగా కులాలవారీగా సమావేశాలు, కుల దైవాలకు గుడుల నిర్మాణం, కమ్యూనిటీ హాళ్ళ శంకుస్థాపనలు చేపట్టారు. మంత్రి కేటీఆర్ తో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇక ఆత్మీయ సమావేశాలతో అన్ని రకాలుగా పార్టీ శ్రేణులను మచ్చికచేసుకునే ప్రయత్నం చేశారు.
నిధుల హామీల వరద పారిస్తూ గెలుపు పై ధీమాతో ఉన్న సమయంలో ఈ అసమ్మతి సమావేశం ఆయనకు కునుకులేకుండా చేస్తోంది. అయితే వీరు బాహాటంగా తిరుగుబాటు జెండా ఎగురవేయకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. వెంటనే వారితో సంప్రదింపులు జరిపి నచ్చచెప్పే ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతానికి ఈ అసమ్మతి చల్లబడినా రానున్నరోజుల్లో మాత్రం మంత్రికి ఇబ్బందులు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి.