గుర్రాలపై బడికి చిన్నారుల సవారి..చూడాల్సిందే మరి !

అరుణాచల్ ప్రదేశ్‌లో గుర్రాలపై పాఠశాలకు వెళ్తున్న చిన్నారుల వీడియో వైరల్‌గా మారింది. వారి గుర్రపు స్వారీ నైపుణ్యం, ప్రకృతి మధ్య సాగే ప్రయాణం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jul 28, 2026, 3:27 pm IST
Read Time: 5 mins
గుర్రాలపై బడికి చిన్నారుల సవారి..చూడాల్సిందే మరి !

భిన్న సంస్కృతులు, భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు నెలవైన భారత్ లో మౌలిక వసతులలో సైతం భిన్నత్వం నెలకొంది. కొన్ని రాష్ట్రాలలో పట్టణాలు, గ్రామాల్లో విద్యా, వైద్యం, రవాణా వంటి మౌలిక వసతుల కల్పన, పారిశ్రామికాభివృద్ది ఎక్కువగా కనిపిస్తుండగా…పర్వత ప్రాంతాలు, లోయలు, నదులతో కూడిన సరిహద్దు రాష్ట్రాలలో పరిస్థితులు అందుకు కొంత భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తరాఖండ్, హిమచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో భౌగోళిక పరిమితుల నేపథ్యంలో ప్రజలకు, విద్యార్ధులకు మౌలిక వసతులు, రవాణా సదుపాయాలు మారుమూల గ్రామాల స్థాయికి చేరని పరిస్థితి నేటికి కొనసాగుతుంది. నదులు, లోయలు దాటేందుకు పలు గ్రామాల్లో ఇంకా తాళ్ల వంతెనలు వంటివి వినియోగిస్తున్న వీడియోలు తరుచూ సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి.

తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని ఒక కొండ ప్రాంతంలో యూనిఫాం ధరించిన పాఠశాల విద్యార్థులు గుర్రాలపై పాఠశాలకు ప్రయాణిస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రోడ్డ మార్గం విశాలంగా చక్కగా కనిపిస్తున్నప్పటికి..బడికి వెళ్లేందుకు తగిన వాహన వసతులు లేకపోవడం లేదా మరో కారణమో గాని.. ఓ విద్యార్ధిని, విద్యార్ధి గుర్రాలపై స్వారీ చేస్తూ ఎంచక్కా రహదారి అంచున చల్ చల్ మంటూ పరుగులు తీస్తున్నారు. వారికి ముందుగా మరో విద్యార్ధి సైకిల్ పై ప్రయాణించడం కనిపిస్తుంది. వీడియోలో విద్యార్ధుల గుర్రపు స్వారీ చూస్తుంటే వారికి అందులో ఎంత చక్కని ప్రావీణ్యం ఉందోననిపించకమానదు. రహదారిపై చిన్నారుల గుర్రపు స్వారీ కనువిందు చేస్తుందని..బడికి వెళ్లడానికి ఎప్పుడూ బస్సు లేదా కార్లు, బైక్ లు మాత్రమే కాదు…కొన్నిసార్లు ఇలాంటి గుర్రపు ప్రయాణాలు ఎంతో హాయిగా ఉంటాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

గుర్రపు స్వారీ అనేది వేగంగా, చాకచక్యంగా ప్రయాణించే ఒక సాహస క్రీడ మరియు కళ కూడా. ఇది పిల్లలకు శారీరక ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నిటారుగా కూర్చోవడం వల్ల శరీరం దృఢంగా మారి కండరాల బలానికి, మెదడుకు, శరీరానికి మధ్య సమన్వయంతో ఏకాగ్రతకు, ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రకృతి ఒడిలో సాహసం, వినోదం, ఆరోగ్యం అన్నీ ఒకేచోట అనుభవించాలంటే ఈ కొత్త ట్రెండ్‌ను అంతా ఒకసారి ప్రయత్నించడం ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు.