ఢిల్లీ జంతర్మంతర్ వద్ద జరిగిన నిరసనల తరువాత ప్రధాని మోదీ విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడిన సెల్ఫీ వీడియోను ఫేస్ బుక్ నుంచి మెటా తొలగించడం తీవ్ర వివాదస్పదమైంది. మోదీ సెల్ఫీ వీడియో కనిపించకపోవడంపై మీడియా కథనాలతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన సోషల్మీడియా దిగ్గజం మెటా సాంకేతిక సమస్య కారణంగానే కొద్దిసేపు ఆ వీడియో కనిపించలేదని వివరణ ఇచ్చింది. అయితే ప్రధాని మోదీ సెల్ఫీ వీడియోను బ్లాక్ చేసిన విషయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించి మెటా అధికారులకు సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఐటీ మంత్రిత్వ శాఖ మెటా, ఇన్స్టాగ్రాం, గ్లోబల్ హెడ్ ల ఉన్నతస్థాయి అధికారులకు సమన్లు ఇచ్చింది. ప్రస్తుతం ప్రధాని మోదీ వీడియో మళ్లీ ఫేస్బుక్లో అందుబాటులోకి వచ్చింది.
నీట్ వివాదంపై విద్యార్ధుల నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ జులై 23న ఫేస్బుక్లో ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో పేపర్ లీక్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. జెన్ జీ విద్యార్థులతో మోదీ చేసిన తొలి ప్రత్యక్ష సంభాషణగా ఈ వీడియోకు భారీ స్పందన వచ్చింది. అయితే అకస్మాత్తుగా జులై 28 తెల్లవారుజామున కొంతసేపు ఈ వీడియో భారతీయ వినియోగదారులకు అందుబాటులో లేకుండా పోయింది. వీడియో స్థానంలో ‘‘చట్టపరమైన అభ్యర్థన కారణంగా మీ ప్రాంతంలో ఈ మీడియా అందుబాటులో లేదు’’ అనే సందేశం కనిపించింది. దీంతో రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఏం జరిగిందోనంటూ తీవ్ర చర్చ మొదలైంది.
ఈ వ్యవహారంపై బీజేపీ భగ్గుమంది. కోట్లాది మంది భారతీయులకు చేరాల్సిన ప్రధానమంత్రి సందేశాన్ని ఒక సోషల్ మీడియా సంస్థ ఎలా అడ్డుకుంటుందని ప్రశ్నించారు. బీజేపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన నేతలు మెటాను ట్యాగ్ చేస్తూ పారదర్శకత, జవాబుదారీతనంపై ప్రశ్నలు లేవనెత్తారు. కంటెంట్ నియంత్రణ పేరుతో రాజకీయ పక్షపాతం చూపుతున్నారా? అనే చర్చను లేవనెత్తారు.
మెటా వివరణ..
ప్రధాని వీడియో తొలగింపుపై వివరణ ఇచ్చిన మెటా.. ఇది ఉద్దేశపూర్వక చర్య కాదని స్పష్టం చేసింది. పొరపాటున వీడియోను బ్లాక్ చేశామని, గుర్తించిన వెంటనే దాన్ని పునరుద్ధరించామని తెలిపింది. వీడియోను తొలగించడానికి కారణమైన ప్రక్రియలో తప్పిదం జరిగిందని, వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఇది కేవలం సాంకేతిక పొరపాటు మాత్రమేనని మెటా పేర్కొంది.