Sim Cards Disconnected | సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్న క్రమంలో సిమ్ తీసుకోవడానికి కొత్త నిబంధనలు ఇకపై డీలర్లకు పోలీస్ చెక్ తప్పనిసరి దేశంలో 52 లక్షల సిమ్లు డీయాక్టివేట్ కేంద్ర లికాం మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి విధాత: కేంద్ర టెలికాం శాఖ దేశవ్యాప్తంగా 52 లక్షల సిమ్ కార్డులను డీయాక్టివేట్ చేసింది. సైబర్ మోసాలను అరికట్టేందుకు సిమ్ కార్డుల విక్రయానికి కొత్త నిబంధనలను కూడా ప్రకటించింది. మోసపూరిత ఫోన్కాల్స్, మెస్సేజ్లతో దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు […]
Sim Cards Disconnected |
విధాత: కేంద్ర టెలికాం శాఖ దేశవ్యాప్తంగా 52 లక్షల సిమ్ కార్డులను డీయాక్టివేట్ చేసింది. సైబర్ మోసాలను అరికట్టేందుకు సిమ్ కార్డుల విక్రయానికి కొత్త నిబంధనలను కూడా ప్రకటించింది. మోసపూరిత ఫోన్కాల్స్, మెస్సేజ్లతో దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు పెట్రేగిపోతున్న నేపథ్యంలో టెలికాం శాఖ కఠిన నిబంధనలను ప్రకటించింది. ఒకే వ్యక్తి గుర్తింపు కార్డు ఆధారంగా వేల సిమ్కార్డులు జారీ అవుతున్న నేపథ్యంలో బల్క్ సిమ్ కార్డు కనెక్షన్లు ఇవ్వడంపై కూడా టెలికాం శాఖ ఆంక్షలు విధించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.
కేంద్ర ప్రభుత్వం 66,000 మోసపూరిత వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేసినట్టు టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 67,000 సిమ్ కార్డ్ డీలర్లను బ్లాక్లిస్ట్ పెట్టిందని చెప్పారు. సైబర్ నేరగాళ్లపై 300 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిందని వెల్లడించారు. 52 లక్షల సిమ్ కనెక్షన్లను డీయాక్టివేట్ చేసినట్టు ఆయన వివరించారు. సైబర్ నేరగాళ్లు వాడిన సుమారు 8 లక్షల బ్యాంక్ ఖాతాలను ప్రభుత్వం నిలిపివేసినట్టు కేంద్ర మంత్రి వివరించారు.
అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు
సిమ్ కార్డుల విక్రయాల్లో మోసాన్ని అరికట్టేందుకు కొత్త నిబంధనలు ప్రవేశపెట్టినట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిపారు.
సిమ్ డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి
ప్రస్తుతం కొందరు డీలర్లు అక్రమ మార్గాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండా సిమ్ కార్డులను విక్రయిస్తున్నారని, ఇక నుంచి అలాంటివి ఉండబోవని స్పష్టంచేశారు. సిమ్ డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తున్నట్టు తెలిపారు.
వెరిఫికేషన్ తర్వాత వారు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని, ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.10 లక్షల జరిమానా విధిస్తామన్నాని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల సిమ్ డీలర్లు ఉన్నట్లు తెలిపారు. వారు వెరిఫికేషన్ పూర్తి చేయడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇస్తున్నట్టు వెల్లడించారు.
ఇకపై బల్క్ కనెక్షన్లు ఉండవు
బల్క్ కనెక్షన్ల నిబంధనను తొలగించి, బిజినెస్ కనెక్షన్ల పేరుతో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇందులో వ్యక్తిగత కేవైసీ తప్పనిసరి అన్నారు. అంటే ఏదైనా కంపెనీ 4000 సిమ్ కార్డులు తీసుకుంటే గతంలో కంపెనీ కేవైసీని మాత్రమే వెరిఫై చేసేవారని, కానీ ఇప్పుడు మొత్తం 4000 మంది ఉద్యోగుల కేవైసీలను వెరిఫై చేసిన తర్వాతే సిమ్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు.