DoT | రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు.. టెలికం కంపెనీలకు డాట్‌ కీలక ఆదేశాలు

DoT | ఇటీవల కాలం సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త మార్గాల్లో సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. కాలింగ్ లైన్ ఐడెంటిటీ (CLI) సైతం మార్చేస్తూ విదేశాల నుంచి కాల్‌ చేస్తూ.. భారత్ నుంచే కాల్స్‌ చేస్తున్నట్లుగా ఫేక్‌ కాల్స్‌తో అమాయకులకు టోకరా వేస్తున్నారు.

DoT | రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు.. టెలికం కంపెనీలకు డాట్‌ కీలక ఆదేశాలు

DoT | ఇటీవల కాలం సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త మార్గాల్లో సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. కాలింగ్ లైన్ ఐడెంటిటీ (CLI) సైతం మార్చేస్తూ విదేశాల నుంచి కాల్‌ చేస్తూ.. భారత్ నుంచే కాల్స్‌ చేస్తున్నట్లుగా ఫేక్‌ కాల్స్‌తో అమాయకులకు టోకరా వేస్తున్నారు. సైబర్ మోసగాళ్లు విదేశాల నుంచి కాల్స్‌ చేస్తున్నా.. మొబైల్స్‌లో భారతీయ మొబైల్‌ నుంచి వచ్చినట్లుగానే కనిపిస్తున్నది. ఈ క్రమంలో అంతర్జాతీయ ఫేక్ కాల్స్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రముఖ టెలికాం సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. భారతీయ మొబైల్ నంబర్లతో వచ్చే అంతర్జాతీయ ఫేక్ కాల్స్‌ని బ్లాక్‌ చేయాలని టెలికాం ఆపరేటర్లకు సూచించింది.

స్థానిక నంబర్ల సాయంతో అంతర్జాతీయ కాల్స్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నట్లుగా టెలికం విభాగంగా పేర్కొంది. నేరగాళ్లు విదేశాల్లో ఉంటూ సీఎల్ఐ మార్పుతో స్థానిక నంబర్లను వినియోగించి కాల్స్‌ చేస్తున్నారని.. ప్రభుత్వ అధికారులు, పోలీసులం అని చెబుతూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా వివరించింది. వర్చువల్ కిడ్నాప్స్‌, కొరియర్‌లో డ్రగ్స్ పార్సిల్‌, ఫెడెక్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని టెలికాం విభాగం పేర్కొంది. ఈ క్రమంలో సర్వీస్‌ ప్రొవైడర్లు, టెలికం సంస్థలతో కలిసి ఫేక్‌ కాల్స్‌ను బ్లాక్‌ చేసేందుకు వ్యవస్థను రూపొందించామని.. ఆ వ్యవస్థను అమలు చేసేందుకు తాజా ఆదేశాలు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటికే ల్యాండ్‌లైన్లకు వచ్చే ఫేక్ కాల్స్‌ని సమర్థవంతంగా కట్టడి చేశామని టెలికం విభాగం అధికార వర్గాలు తెలిపాయి.