విధాత, సినిమా: తారకరత్న(Tarakaratna) మరణంతో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మరణం కుటుంబ సభ్యులకు తీవ్ర వేదనను మిగిల్చింది. భర్త దూరం కావడంతో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి (Alekhya Reddy) విషాదంలో ఉండిపోయారు. ఆయన పెద్దకర్మ మార్చి 2న హైదరాబాదులోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (Filmnagar Cultural Center)లో నిర్వహించారు.
ఈ సందర్భంగా తారకరత్న రాసిన లేఖ (letter) ను అలేఖ్య సోషల్ మీడియా(Social media)లో షేర్ చేసింది. గతంలో ప్రేమికుల రోజు(Valentine’s Day) సందర్భంగా అలేఖ్యకు తారకరత్న ఓ లేఖ రాశారు. ఆ లేఖని అలేఖ్య తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అందులో.. ‘‘ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో నాకు అర్థం కావడం లేదు. ముందుగా ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. నేను భావోద్వేగాలను అద్భుతంగా వ్యక్తపరచలేనని నీకు తెలుసు. అయినప్పటికీ ఒక అడుగు ముందుకేసి నీకు మాట చెప్తున్నా. ఐ లవ్ యు(I Love You).. నాకంటే ఎక్కువగా నిన్నే నేను ప్రేమిస్తాను. కొన్నిసార్లు నిన్ను కష్టపెట్టేలా ప్రవర్తించి ఉండొచ్చు.
అది ప్రేమతోనే కానీ ద్వేషంతో కాదు. నాతో కలిసి జీవించడం కొంచెం కష్టమని నాకు తెలుసు. అయినా సరే.. అన్నివేళలా నాకు అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు. నువ్వే నా ప్రపంచం బంగారు. నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను..’’ అని తారకరత్న రాసిన లేఖను అలేఖ్య రెడ్డి షేర్ చేశారు.
ఈ నోట్ను షేర్ చేస్తూ అలేఖ్య భావోద్వేగపూరితంగా కామెంట్ చేశారు. మా జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాం. ఎత్తుపల్లాలు చూశాం. అయినప్పటికీ జంటగా అన్నింటిని అధిగమించాం. ఒక చిన్న కుటుంబాన్ని సృష్టించుకున్నాం. నాలా ఎవరూ నిన్ను అర్థం చేసుకోలేదు. నేను నిన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషిస్తున్నా. నీ బాధనంత లోపలనే దాచుకొని మాకు అపారమైన ప్రేమను అందించావు.. అని అలేఖ్య కామెంట్ చేశారు.