AP | విధాత: నిరుపేద గిరిజనుడు.. ఉండేది మారుమూల ఏజెన్సీ గ్రామం. దగ్గర్లో ఆస్పత్రులు ఉండవు.. చుట్టూ కొండలు గుట్టలు.. వాగులు వంకలు.. అవి దాటితే కానీ వైద్యం అందదు.. వీళ్లకు వైద్యం అందదు కదాని రోగాలు రావడం మానేయవు కదా.. వస్తాయి.. వచ్చింది. పార్వతీపురం మన్యం కొమరాడ మండలం.. చోళ్ళ పదం పంచాయతీ రెబ్బ గ్రామానికి చెందిన ఓ గిరిజనుడి పదేళ్ల బిడ్డ తీవ్ర అస్వస్థకు గురైంది. దగ్గరలో వైద్యం లేదు.. పోనీ వేరే ఊరు […]
AP |
విధాత: నిరుపేద గిరిజనుడు.. ఉండేది మారుమూల ఏజెన్సీ గ్రామం. దగ్గర్లో ఆస్పత్రులు ఉండవు.. చుట్టూ కొండలు గుట్టలు.. వాగులు వంకలు.. అవి దాటితే కానీ వైద్యం అందదు.. వీళ్లకు వైద్యం అందదు కదాని రోగాలు రావడం మానేయవు కదా.. వస్తాయి.. వచ్చింది. పార్వతీపురం మన్యం కొమరాడ మండలం.. చోళ్ళ పదం పంచాయతీ రెబ్బ గ్రామానికి చెందిన ఓ గిరిజనుడి పదేళ్ల బిడ్డ తీవ్ర అస్వస్థకు గురైంది.
దగ్గరలో వైద్యం లేదు.. పోనీ వేరే ఊరు పోదాం అంటే నాగావళి నది నాగుపాములా పడగవిప్పి పెల్లు బీకుతోంది. అయినా సరే తండ్రి మనసు ఊరుకోలేదు.. ఊళ్ళోని వాళ్ళతో కలిసి వెదురు బొంగులతో ఒక తెప్ప మాదిరి తయారు చేసి తన బిడ్డను ఒళ్ళో పెట్టుకుని ఒరిస్సా రాష్ట్రంలోకి వెళ్ళి బిడ్డకు చికిత్స చేయించాడు.
నాగావళి నది మీద పూర్ణపాడు – లాబేసు వంతెన పనులు మొదలై చాన్నాళ్ళయినా బిల్స్ రాక పోవడంతో కాంట్రాక్టర్ పనులు వదిలేసి వెళ్ళి పోయాడు. దీంతో నది అవతలి గ్రామాల ప్రజలు ఈ వర్షా కాలంలో ప్రాణాలు అర చేతబట్టుకుని ఉంటారు. ఏదైనా అనారోగ్యం.. ఇంకేదన్నా అత్యవసర పరిస్థితి వస్తే మాత్రం ఇలాగే ప్రాణాలు అరచేతబట్టుకుని నదిని దాటి బాహ్యప్రపంచంలోకి రావాలి.. మళ్ళీ అదే ప్రమాదం మధ్య ఇంటికి చేరాలి.