రెండుసార్లు వరుసగా సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పార్టీ. 2019లో సొంతంగానే 300 మార్క్ను దాటిన పార్టీ. ఈసారి 370 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న పార్టీ
రెండుసార్లు వరుసగా సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పార్టీ. 2019లో సొంతంగానే 300 మార్క్ను దాటిన పార్టీ. ఈసారి 370 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న పార్టీ. ముచ్చటగా మూడోసారి అధికారం మాదే అంటున్న పార్టీ. పదేళ్లలో దేశాన్ని ప్రపంచంలో ఐదో ఆర్థిక వ్యవస్థ తీర్చిద్దామని చెప్పుకుంటున్న పార్టీ. 15 కోట్ల మందిని పేదరికంలో బైట పడేశామంటున్న పార్టీ. ఇన్ని మాటలు చెబుతున్న కమలనాథులకు వారు ఆశిస్తున్న 370 సీట్లు సాధ్యమౌతాయా? ఈసారి ఎన్నికల్లో విజయం సునాయసమేనా? అంటే చెప్పలేని స్థితిలోనే ఉన్నారనేకంటే అయోమయంలోనే ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో.
ఎందుకంటే బీజేపీ ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలువాలని ఇప్పటివరకు 130 స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. ఇందులో కొంతమంది అసెంబ్లీకి ఎన్నికైతే మరికొందరు సిట్టింగ్ ఎంపీలు కన్నుమూయడంతో మార్చాల్సి వచ్చింది. ఇట్లా వివిధ కారణాలతో సీట్లు మార్చిన వారి సంఖ్య 20 వరకు ఉంటే 110 మంది సిట్టింగులకు టికెట్ నిరాకరించింది.
ఇందులో విచిత్రమేమిటి అంటే రాజ్యాంగాన్ని మారుస్తామన్న అనంతకుమార్హెగ్డేను, చట్టసభలలో మైనారిటీ ఎంపీని కించిపరిచేలా వ్యాఖ్యానించినందుకు రమేశ్ బిధూరిని పక్కనపెట్టింది. కానీ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇలాంటి వివాదాస్పద అంశాలనే వాట్సప్ యూనివర్సిటీ ద్వారా ప్రచారం చేయిస్తుంటుంది. సాక్షాత్తూ ప్రధాని సహా కేంద్రమంత్రులు ఎన్నికల సమయంలో ఇవే అంశాలను ప్రస్తావిస్తుంటారు. ప్రధాని మధ్యప్రదేశ్, యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని పక్కదేశం పాకిస్థాన్ గురించి, భారత్ మాతాకీ జై అనని వాళ్లను పార్లమెంటులో అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు.
పదేళ్ల ఎన్డీఏ పాలనలో మానవాభివృద్ధి సూచీ, పత్రికా స్వేచ్ఛ, లింగ సమానత్వం, ఉపాధి, ఉద్యోగ కల్పన వంటి విషయాల్లో ప్రధాని ప్రస్తావించిన దేశంతో పాటు చిన్న దేశాలు మనకంటే మెరుగైన స్థితిలో ఉన్నాయనేది గణాంకాల ద్వారా తెలుస్తున్నది. పదేళ్లలో తాము దేశాభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు, ప్రజా సంక్షేమం కోసం అమలు చేసిన పథకాల, వాటి వల్ల వచ్చిన ఫలితాల గురించి ఎన్నికల సమయంలో మాట్లాడరు.
బీజేపీ పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రలో విదర్భ డివిజన్లోనే 2020-2022 మధ్య కాలంలో సుమారు 4000 వేల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడినట్టు నివేదికలు చెబుతున్నాయి. వీటిపై స్పందించరు. ఇంకా రామ మందిర నిర్మాణం, పాకిస్థాన్, సర్జికల్ స్ట్రైక్స్ వంటివే ప్రచారం చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. పండించిన పంటలకు మద్దతు ధరలకోసం పోరాడుతున్న రైతులకు, కొవిడ్ తర్వాత ఉపాధి అవకాశాలు కోల్పోయిన నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉద్యోగాల కల్పనపై మాట్లాడే సాహసం బీజేపీ నేతలు చేయడం లేదు.
ఈసారి ఎన్నికల్లో నిరుద్యోగం, వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల వంటివే ప్రభావం చూపనున్నాయనేది జాతీయ మీడియాతో పాటు వివిధ సర్వే సంస్థలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమౌతుందని బీజేపీ గొప్పలు చెప్పుకుంటుంటుంది. కానీ వాళ్లు అధికారంలో ఉన్నరాష్ట్రాల్లోనే వివాదాస్పద వ్యాఖ్యలు, స్థానిక పరిస్థితులు, విజయవకాశాలు, పనితీరు వంటి కారణాలతో 110 మంది సిట్టింగ్ ఎంపీలను మార్చింది.
వాటిలో పెద్ద రాష్ట్రాలు, గత ఎన్నికల్లో ఆ పార్టీకి మెజారిటీ సీట్లు అందించిన యూపీ(15), మహారాష్ట్ర (7), రాజస్థాన్ (14 ), కర్ణాటక (13) , గుజరాత్ (14), బెంగాల్( 6), అస్సాం (6) లతోపాటు 7స్థానాలున్న ఢిల్లీలో ఏకంగా 6 గురిని మార్చింది. ఇవన్నీ కలిపితే 81 స్థానాలు. ఆ పార్టీ గెలిచిన 303 స్థానాల్లో దాదాపు 36 శాతం మంది సిట్టింగులను మార్చిన బీజేపీ ప్రభుత్వ పాలన విధానాలు, పనితీరు, పార్టీలో క్రమశిక్షణ ఎలా ఉన్నదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ఈసారి ఈసారి కమలనాథులు ఆశిస్తున్న 370 సీట్ల లక్ష్య సాధన కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమౌతున్నది. మూడోసారి అధికారంలోకి వస్తామంటున్న వారి ఆశలు అడియాశలయ్యేలా ఉన్నాయి.