Harish Rao | సన్న వడ్ల బోనస్.. బోగస్.. రూ.1,161 కోట్ల బోనస్ బకాయిలు : మాజీ మంత్రి హరీశ్ రావు

Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో సన్న వడ్ల బోనస్ కూడా బోగస్ అయిందని.. యాసంగి లో సన్నాల కొనుగోలు పూర్తయినా రూ. 1,161 కోట్లు బోనస్ ఇంకా విడుదల చేయకపోవడం దుర్మార్గమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టీ హరీశ్రావు విమర్శించారు. 4.01 లక్షల మంది రైతుల నుంచి 23.22 లక్షల టన్నుల సన్నాలు సేకరించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బోనస్ చెల్లించలేదన్నారు. రాష్ట్రంలో పొద్దు తిరుగుడు (సన్ ఫ్లవర్) రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని అన్నారు. సన్ ఫ్లవర్ కొనుగోలు పూర్తయి 75 రోజులు దాటినా రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం రైతుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతుందని విమర్శించారు. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 50 శాతం రైతులకు డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. దీనిబట్టే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు వేస్తామని ప్రగల్భాలు పలికిన మంత్రి తుమ్మల.. రెండు నెలలు దాటినా ఇప్పటికీ రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయకపోవడం శోచనీయమన్నారు. వెంటనే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.1,116 కోట్ల రూపాయల సన్నాల బోనస్ డబ్బులతో పాటు సన్ ఫ్లవర్ రైతులకు పంట కొనుగోలు డబ్బులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతులను గోస పెట్టడం అలవాటు..
రైతులను గోస పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని హరీశ్రావు విమర్శించారు. ప్రతీచోట రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఎన్నికల ముందు అబద్ధపు హామీలు, గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. పాలనను కూడా అదే అబద్ధాలతో నడిపిస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ 50 శాతం రైతులకి కూడా అందలేదని.. పోయిన వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టారని అన్నారు. యాసంగిలో రైతు భరోసా సగం మందికి కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నికల ముందు రూ.15 వేల రైతు భరోసా అని చెప్పి మాట తప్పి రూ.12,000 కి పరిమితం చేశారని మండిపడ్డారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా అని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. రైతు కూలీల పరిస్థితి అయితే అథోగతే అయ్యిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సన్ ఫ్లవర్ పంటకు డబ్బులు, సన్నాలకు బోనస్ డబ్బులు కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.