రెండవ శ్రీశైలంగా పేరొందిన చెరువుగట్టు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
విధాత, హైదరాబాద్ : రెండవ శ్రీశైలంగా పేరొందిన శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం(చెరువుగట్టు) బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 14నుంచి 21వరకు జరిగే చెర్వుగట్టు బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు.
పారిశుద్ధ్యం, మంచినీటి వసతుల కల్పనపైన, భక్తులకు దర్శన వసతులపైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 16వ తేదీ శుక్రవారం(తెల్లవారి శనివారం ఉదయం 4గంటలకు) జరిగే కల్యాణోత్సవం, ఆదివారం రాత్రి(సోమవారం తెల్లవారుజామున 4గంటలకు) జరిగే అగ్నిగుండాల కార్యక్రమం ఘనంగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, దేవాదాయ శాఖ కమీషనర్ అనిల్ కుమార్, అసిస్టెంట్ కమీషనర్ మహేంద్రకుమార్, దేవస్థాన ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, ఇతర అధికారులు, అర్చకులు, చెరువుగట్టు, ఎల్లారెడ్డి గూడెం కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.