అసెంబ్లీలో విద్యుత్తు శ్వేతపత్రం చర్చలో అక్బరుద్ధిన్ మాట్లాడుతున్న క్రమంలో చేసిన వ్యాఖ్యలు ఆయనకు, సీఎం రేవంత్రెడ్డి మధ్య వాగ్వివాదానికి, సవాళ్లకు దారితీసింది
విధాత : అసెంబ్లీలో విద్యుత్తు శ్వేతపత్రం చర్చలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్ధిన్ ఒవైసీ మాట్లాడుతున్న క్రమంలో చేసిన వ్యాఖ్యలు ఆయనకు, సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులకు మధ్య వాగ్వివాదానికి, పరస్పర విమర్శలు, సవాళ్లకు దారితీసింది. శ్వేతపత్రంపై అక్బరుద్ధిన్ మాట్లాడుతూ పాతబస్తీలో విద్యుత్తు సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారానికి 500కోట్లు కావాలన్నారు.
ఈ సందర్భంగా మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు పాతబస్తీకి సంబంధించిన సమస్యలపై బీఆరెస్ పదేళ్ల ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదంటూ, 500కోట్లు ఎందుకు డిమాండ్ చేయలేదంటు ప్రశ్నించారు. ప్రతిస్పందించిన అక్బరుద్ధిన్ మీరు బచ్చా.. చిన్న పిల్లలు పెద్ద పెద్ద విషయాల్లో దూరడం అవసరమా అంటూ సత్యనారాయణను ఉద్ధేశించి వ్యంగ్యంగా విమర్శించారు.
మేం అనేక పర్యాయాలు బీఆరెస్ ప్రభుత్వాన్ని ఓల్డ్ సిటీ సమస్యలపైన ప్రశ్నించామని, మొత్తంగా 25వేల కోట్ల అభివృద్ధి నిధులు సాధించామని వివరించారు. దీంతో సీఎం రేవంత్రెడ్డి కలగచేసుకుని అసెంబ్లీలో సీనియర్, జూనియర్ సభ్యులందరికి ఒకే హక్కులుంటాయని స్పష్టం చేశారు. సీనియర్ లెజిస్లేటర్గా అక్బరుద్ధిన్ తొలిసారిగా ఎన్నికైన దళిత ఎమ్మెల్యేను అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు.
అక్బరుద్ధిన్ ప్రసంగం తన పాత స్నేహితుడైన బీఆరెస్కు అనుకూలంగా ఉందని, విద్యుత్తు శ్వేతపత్రంపై ఆయన సలహాలు, సూచనలు ఇవ్వడానికి పరిమితం కావాలన్నారు. పాతబస్తీ తెలంగాణలోనే ఉందని, ముస్లింలకు ఎంఐఎం టేకిదార్ కాదని, హిందూవులు కూడా ఓటేస్తేనే మీరు ఇక్కడికి వచ్చారన్నారు.
ముస్లిం అభ్యర్థులను ఓడించడంలో ఎంఐఎం, బీఆరెస్లు ఇద్దరు ఒక్కటేనన్నారు. కామారెడ్డిలో గతంలో షబ్బీర్ను, జూబ్లిహిల్స్లో మొన్న అజారుద్ధిన్ను ఓడించారని విమర్శించారు. నాంపల్లి, బహదూర్పూర్లో ఎంఐఎం ఎన్ని ఓట్లతో గెలిచారో తెలుసన్నారు. అవకాశవాదంతో ఎంఐఎం తడవకో పార్టీతో పొత్తు పెట్టుకుందని, చివరకు బీజేపీతో కూడా అంటకాగిందని విమర్శించారు. గత ప్రభుత్వంతో కలిసి మీరు పనిచేయడం నిజం కాదా అని రేవంత్ నిలదీశారు.
పాతబస్తీ అభివృద్ధికి మేం బాధ్యతగా పనిచేస్తామని మాకు ఆ చిత్తశుద్ధి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్గా పనిచేసిందని, ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లను గతంలో అమలు చేసిందని, ఎంఐఎం మిత్రుడు బీఆరెస్ ప్రభుత్వం 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని చేయలేదన్నారు. మేం ముస్లిం మైనార్టీని పీసీసీ అధ్యక్షుడిగా, హోంశాఖ మంత్రిగా, రాష్ట్రపతిగా చేశామన్నారు.
మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ సీఎం కేసీఆర్, ఎంఐఎం ఎమ్మెల్యేల పరిధిలోని సౌత్ హైద్రాబాద్ పాతబస్తీలోనే మొండి బకాయిలు రాష్ట్రంలో అధికంగా ఉన్నాయని రేవంత్రెడ్డి వెల్లడించారు. మొదటి స్థానంలో సిద్ధిపేట 61.37శాతం బకాయిలు, రెండో స్థానంలో గజ్వేల్ 50.29శాతం బకాయిలు, మూడో స్థానంలో సౌత్ హైద్రాబాద్ 43శాతం బకాలయిలు ఉన్నాయన్నారు. విద్యుత్తు రంగం సంక్షోభానికి కారణమై ఆ బకాయిల వసూళ్లకు వీలైతే అక్కడి ముగ్గురు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోని బిల్లులు కట్టేలా చూడాలన్నారు.
అలాగే మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి విద్యుత్తు శ్వేత పత్రం చర్చలో వారి హాయంలో పదేళ్లలో ఎక్కడా రైతులు విద్యుత్తు కోసం రోడ్డెక్కలేదని అసత్యాలు చెప్పారని రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కామారెడ్డి లో సెప్టెంబర్ 1న రైతులు సబ్ స్టేషన్ లో ముట్టడి చేశారని,సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, గరిడేపల్లి సహా పలుచోట్ల రైతులు విద్యుత్తు కోసం ఆందోళన చేశారని వెల్లడించారు. కరెంటు అందక పంటలు ఎండిపోయి రైతు కొమురయ్య మృతి చెందాడన్నారు.
ముస్లిం మైనార్టీలకు తానొక్కడే టేకేదార్ అన్నట్లుగా మాట్లాడుతున్న అక్బరుద్ధిన్ శ్రీశైలం ఎడమ గట్టు కాలువ 900 మెగావాట్ల ఉత్పత్తి ప్రాజెక్టు అగ్నిప్రమాదంలో పాతబస్తీకి చెందిన ముస్లిం మహిళా ఉద్యోగిని ఫాతిమా చనిపోతే కనీసం వారి మిత్రుడైన బీఆరెస్ ప్రభుత్వం నుంచి సీఎం, విద్యుత్తు మంత్రి పరామర్శ కూడా చేయలేదని, మేం వెళ్లి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డామన్నారు.
బీఆరెస్ పదేళ్ల దుర్మార్గ పాలనలో సభలో ఎంఐఎం ఏనాడు ప్రస్తావించలేదన్నారు. తనపాత స్నేహితుడిని రక్షించేందుకు అక్బరుద్ధిన్ శాయశక్తుల ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారితో స్నేహం ఎంఐఎంకు మంచిదికాదన్నారు. ఎన్టీఆర్ హాయం నుంచి కేసీఆర్ వరకు ఎవరు ఎవరితో దోస్తీ చేశారో తర్వతా చర్చిద్దామన్నారు. అధికారం ఎక్కడ ఉంటే ఎంఐఎం అక్కడ ఉంటుందన్నారు. కాగా సీఎం రేవంత్రెడ్డి ఎంఐఎం పొత్తులపైన చేసిన వ్యాఖ్యలపై మండిపడిన అక్బరుద్ధిన్ బాబ్రీ మసీద్ కూల్చిన బీజేపీతో మేం చచ్చినా పొత్తు పెట్టుకోమన్నారు.
మేం బీఆరెస్, బీజేపీలకు బీటీమ్ కాదన్నారు. సీఎం రేవంత్రెడ్డి అనేక పార్టీలు మారిన సంగతి మరువరాదన్నారు. పాతబస్తీ సమస్యలపై గత ప్రభుత్వాన్ని కూడా తాము ఇదే సభలో నిలదీశామన్నారు. 2014లో మేం జూబ్లిహిల్స్లో అభ్యర్థిని పెట్టామన్నారు. అంబేద్కర్ను ఓడించింది కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు. దీంతో మరోసారి అధికార ప్రతిపక్షాల మధ్య రభస చోటుచేసుకుంది.
మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం భట్టిలు మాట్లాడుతూ ఎంఐఎం సభ్యుడు అక్బరుద్ధిన్ మాట్లాడిన తీరును తప్పుబట్టారు. ఈ సందర్భంగా వారితో కూడా అక్బరుద్ధిన్కు వాగ్వివాదం సాగింది. పరస్పర సవాళ్లతో సభ దద్దరిల్లింది. శ్వేతపత్రం చర్చపై మాత్రమే బీజేపీ సభ్యుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ఎంఐఎం పక్ష నేత అక్బరుద్ధిన్ బీజేపీపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. నిన్నటి వరకు సర్కార్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉండేదన్నారు. బాబ్రీ కూల్చివేతలో బీజేపీకి సంబంధం లేకున్నా అక్బరుద్ధిన్ విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.
ఇదే సమయంలో మాజీ మంత్రులు హరీశ్రావు మాట్లాడుతూ తమ నియోజకవర్గ ప్రజలే విద్యుత్తు బిల్లులు ఎగవేశారన్నట్లుగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని, కంపనీల బిల్లులు కట్టకపోయినా బకాయిలు భారీగా చూపిస్తాయన్నారు. మా ప్రజలను సీఎం ఎగవేత దారులుగా అవమానించడం సరికాదన్నారు. దీనిపై పొన్నం మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ప్రజలను తప్పుబట్టలేదని, అయినా మీరు గతంలో నాకు పిండం పెట్టించారని దాని సంగతేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మాజీ మంత్రి కేటీఆర్ అయితే సీఎం రేవంత్రెడ్డి మాజీ సీఎం కేసీఆర్కు కూడా పిండం పెట్టాలన్నారని కౌంటర్ వేశారు. ఇదే సమయంలో స్పీకర్ సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావుకు మాట్లాడే అవకాశం కల్పించారు.