పులుల కోటల్లోనూ పర్యాటక అభివృద్ధి: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో పర్యావరణ హిత పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు

పులుల కోటల్లోనూ పర్యాటక అభివృద్ధి: సీఎం రేవంత్ రెడ్డి
  • ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక
  • అటవీ, పర్యాటక శాఖ కలిసి పని చేయాలి
  • సాధారణ బదిలీలపై వేసవిలోనే నిర్ణయం
  • కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రోత్సాహం
  • ఐఎఫ్ఎస్‌ ఖాళీల భర్తీకి కేంద్రానికి విజ్ఞప్తి
  • అటవీశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

విధాత‌: రాష్ట్రంలో పర్యావరణ హిత పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అటవీ, పర్యాటక శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యాటకులను ఆకట్టుకునేలా వైవిధ్యమున్న ప్రాంతాలను గుర్తించాలన్నారు. రెండు విభాగాలు సంయుక్తంగా పర్యాటక ప్రాజెక్టుల ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పారు. అటవీ అందాలు, వన్య ప్రాణులు, వలస వచ్చే విదేశీ పక్షులు, విభిన్న జీవ వైవిధ్యమున్న ప్రాంతాలు, హెరిటేజ్ ప్రదేశాలు, సంస్కృతికి అద్దం పట్టే ప్రాంతాలన్నింటినీ గుర్తించి, వాటిని అభివృద్ధి చేయాలని అన్నారు. తెలంగాణలో అడవులతో ముడిపడి ఉన్న ప్రకృతి అందాలను, పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించేలా ప్రతిపాదనలు రూపొందించాలని, అందుకు అవసరమైన కృషి చేయాలని అన్నారు. అవసరమైతే ప్రత్యేకంగా కన్సెల్టెన్సీలను నియమించి ప్రతిపాదనలు తయారు చేయించాలని చెప్పారు.

పర్యాటక ప్రాంతాలుగా టైగర్‌ రిజర్వ్‌లు

ఉత్తర తెలంగాణలో కవ్వాల్, దక్షిణ తెలంగాణ వైపు అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. వన్య ప్రాణులకు హాని కలిగించకుండా ప్రత్యేక పర్యాటక విధానం తయారు చేయాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అటవీ ప్రాంతాల్లోనే పర్యాటకులు విడిది చేసేలా ప్రాజెక్టులు కూడా ఉన్నాయని, వాటిని అధ్యయనం చేసి, అక్కడ అనుసరిస్తున్న రక్షణ, భద్రత చర్యలను రాష్ట్రంలోనూ అమలయ్యేలా చూడాలని చెప్పారు.

డిప్యూటేషన్లపై వెళ్లినవారు వెనక్కు

అటవీ శాఖ నుంచి డిప్యుటేషన్ పై ఇతర విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలను వెంటనే సమర్పించాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే వెంటనే వారిని వెనక్కి రప్పించే చర్యలు చేపడుతామన్నారు.

ఎన్నికల కోడ్‌ ముగిశాకే బదిలీలు

ఏళ్లకేళ్లుగా ఒకే చోట పని చేస్తున్న ఉద్యోగుల బదిలీ చేయాలని, అందుకు వీలుగా బదిలీలపై నిషేధం ఎత్తివేయాలని అధికారులు సమావేశంలో సీఎం దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నందున, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత బదిలీల ప్రక్రియపై నిర్ణయం తీసుకుందామన్నారు. ఉద్యోగుల పిల్లల చదువులకు కూడా ఇబ్బంది లేకుండా వేసవిలోనే బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. అన్ని విభాగాల్లోనూ ఏళ్లకేళ్లుగా ఒకే చోట పాతుకుపోయిన ఉద్యోగులను బదిలీ చేసేలా సాధారణ బదిలీలకు మార్గదర్శకాలు కూడా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

పర్యావరణ హిత కంపెనీలకు ప్రోత్సాహకాలు

కాలుష్య నిబంధనలు, ప్రమాణాలను పాటించే పరిశ్రమలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి ఏడాది పర్యావరణ దినోత్సవం లాంటి సందర్భాన్ని పురస్కరించుకొని జీరో పొల్యూషన్ పాటించే సంస్థలకు ప్రశంసా పత్రాలను అందించాలని చెప్పారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం నగరాలకు అందుబాటులో ఉండేలా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయాలని, ఎక్కడ అనువైన ప్రాంతాలున్నాయో పరిశీలించి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిబంధనలను అతిక్రమించి ప్లాస్టిక్ తయారు చేసే పరిశ్రమలకు నోటీసులు ఇవ్వాలని, భారీగా జరిమానాలు విధించాలని చెప్పారు.

ఐఎఫ్‌ఎస్‌ పోస్టుల భర్తీకి కృషి

రాష్ట్రానికి మంజూరైన 81 మంది ఐఎఫ్ఎస్ పోస్టుల్లో ప్రస్తుతం 55 మంది మాత్రమే ఉన్నారని, మిగతా 26 ఐఎఫ్ఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చర్చ జరిగింది. ఖాళీలు లేకుండా సరిపడే సంఖ్యలో ఐఎఫ్ ఎస్ లను కేటాయించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

నర్సరీల్లో అందుబాటులో 22 కోట్ల మొక్కలు

రాష్ట్రంలోని నర్సరీల్లో దాదాపు 22 కోట్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయని అధికారులు సీఎంకు నివేదించారు. జూన్‌లో వర్షాకాలం ఆరంభంలో వీటిని నాటేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అడవుల్లో చెట్ల నరికివేతతో ఖాళీ అయిన ప్రాంతాల్లో మొక్కలు పెంచాలని, అవసరమైతే అక్కడే బోర్లు వేయించి నీరు అందేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఆక్రమణకు గురవుతున్న పారెస్ట్ ల్యాండ్ ల చుట్టూ కాంపౌండ్ వాల్ లేదా ఫెన్సింగ్ వేసి కాపాడే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి వచ్చే కాంపా నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియాల్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం కార్యదర్శి చంద్ర శేఖర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.