Parliament Sessions

విధాత: పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడటంతో శుక్రవారంతో వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ముగిశాయి. జూలై 20నుండి ఆగస్టు 11వరకు 17సార్లు లోక్‌సభ సమావేశాలు కొనసాగాయని, 44గంటల 15నిమిషాలు లోక్‌సభలో కార్యకలాపాలు సాగినట్లుగా స్పీకర్‌ ఓం ప్రశాక్‌ బిర్లా తెలిపారు. మొత్తం 20బిల్లులను సభలో ప్రవేశపెట్టగా, 22బిల్లులు ఆమోదం పొందాయని స్పీకర్‌ వెల్లడించారు.

పార్లమెంటు సమావేశాల మొదటి రోజు నుంచి మణిపూర్‌ హింసపై ప్రతిపక్షాలు, ప్రభుత్వానికి మధ్య వాదోపవాదాలు, వాకౌట్లతో ఉభయ సభలు పలు మార్లు వాయిదా పడ్డాయి. కేంద్రంపై జూలై 26న ఇండియా కూటమి పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌ సభలో మూడు రోజుల వ్యవధిలో 20గంటల పాటు చర్చ సాగింది.

60మంది సభ్యులు చర్చలో పాల్గొనగా, చర్చకు చివరగా ప్రధాని నరేంద్రమోడీ సమాధానామిచ్చాకా, మూజువాణి ఓటుతో అవిశ్వాసం వీగిపోయింది.ఈ సమావేశాల్లో సహకార సంఘాల బిల్లు, డిజిటల్‌ వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు, సీఈసీ నియామకం, జన్‌ విశ్వాస్‌(సవరణ) బిల్లు, డిల్లీ పాలనాధికారాల బిల్లులు ఆమోదం పొందాయి. చివరి రోజున ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ చట్టాల స్థానంలో మూడు బిల్లులను ప్రవేశ పెట్టారు.