Crime | భార్యపై అనుమానంతో ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. అన్నెంపున్నెం ఎరుగని 20 రోజుల పసికందుకు విషం ఎక్కించాడు. ప్రస్తుతం ఆ పసిపాప మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటన ఒడిశాలోని బాలాసోర్లో వెలుగు చూసింది. బాలాసోర్కు చెందిన చందన్కు తన్మయి అనే యువతితో సంవత్సరం క్రితం పెళ్లి అయింది. వీరి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగింది. కానీ తన్మయి గర్భం దాల్చి, పాపకు జన్మనిచ్చిన తర్వాత చందన్కు అనుమానం పెరిగింది. ఈ ఏడాది మే 9వ […]
Crime | భార్యపై అనుమానంతో ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. అన్నెంపున్నెం ఎరుగని 20 రోజుల పసికందుకు విషం ఎక్కించాడు. ప్రస్తుతం ఆ పసిపాప మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటన ఒడిశాలోని బాలాసోర్లో వెలుగు చూసింది.
బాలాసోర్కు చెందిన చందన్కు తన్మయి అనే యువతితో సంవత్సరం క్రితం పెళ్లి అయింది. వీరి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగింది. కానీ తన్మయి గర్భం దాల్చి, పాపకు జన్మనిచ్చిన తర్వాత చందన్కు అనుమానం పెరిగింది.
ఈ ఏడాది మే 9వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది తన్మయి. అయితే ఈ బిడ్డకు తనకు పుట్టలేదని, తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, అతడి వల్లే గర్భం దాల్చిందని చందన్ అనుమానించాడు. దీంతో ఆ పాపను మట్టుబెట్టాలని చందన్ నిర్ణయించుకున్నాడు.
ఇక తన్మయి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి తన పుట్టింటికి వెళ్లింది. దీంతో భార్యాబిడ్డలను చూసేందుకు సోమవారం అత్తగారింటికి వెళ్లాడు చందన్. భార్య లేని సమయంలో పురుగుల మందును సిరంజి ద్వారా పసిపాప శరీరంలోకి ఎక్కించాడు. ఆ సూది నొప్పి భరించలేక పాప గట్టిగా ఏడ్వడంతో మరో గదిలో ఉన్న తల్లి తన్మయి పరుగెత్తుకొచ్చింది.
చందన్ చేతిలో ఉన్న సిరంజి, పక్కనే ఉన్న పురుగుల మందు డబ్బాను చూసి తన్మయి షాక్కు గురైంది. వెంటనే పాపను బాలాసోర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు చందన్ను అదుపులోకి తీసుకున్నారు.