CUET-UG 2024 : దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సీయూఈటీ-యూజీ (CUET-UG) 2024 పరీక్షలకు దరఖాస్తుల గడువును పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టితో దరఖాస్తుల గడువు ముగియగా.. మార్చి 31వ తేదీ రాత్రి 9.50 గంటల వరకు ఆ గడువును పొడిగిస్తున్నట్లు యూజీసీ ఛైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ తెలిపారు.
పరీక్షలు రాయగోరే అభ్యర్థులు https://exams.nta.ac.in/CUET-UG/ వెబ్సైట్ ద్వారా మార్చి 31న రాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జగదీశ్ కుమార్ చెప్పారు. అభ్యర్థుల నుంచి వచ్చిన గడువు పొడిగించాలన్న అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. కాగా, CUET-UG 2024 పరీక్షలను మే 15 నుంచి 31 మధ్య నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఎన్టీఏ తెలిపింది.
తెలుగు సహా మొత్తం 13 భాషల్లో 27 సబ్జెక్టులకు ఈ పరీక్షలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 354 పట్టణాలు, విదేశాల్లోని 26 పట్టణాల్లో సీయూఈటీ-యూజీ పరీక్షలను హైబ్రిడ్ పద్ధతి (ఆన్లైన్/ఆఫ్లైన్) లో రోజుకు రెండు మూడు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. జూన్ 30న ఫలితాలను వెల్లడిస్తారు.