Site icon vidhaatha

HCUలో కుక్కల దాడి.. జింక మృతి!

HCU : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో భూముల వివాదం కొనసాగుతున్న క్రమంలో ఓ జింక మృతి చర్చనీయాంశమైంది. HCU సౌత్ క్యాంపస్ హాస్టల్ వైపు వచ్చిన జింక పై కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో జింకకు గాయాలు కావడంతో యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది పశువుల ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఆ జింక మృతి చెందింది. HCU పరిధిలోని కంచ గచ్చిబౌలి 400ఎకరాల్లో నివసిస్తున్న జింకలు ప్రభుత్వం తాజాగా చేపట్టిన చెట్ల తొలగింపుతో ఆవాసం కోల్పోయి యూనివర్సిటీ క్యాంపస్ వైపుకు వచ్చాయి. అక్కడున్న కుక్కలు జింకపై దాడి చేయడంతో అది మృత్యువాత పడింది. ఇప్పుడు ఇదే అంశంపై విద్యార్ధులు, వారి ఆందోళనకు మద్ధతునిచ్చిన వారు మరింత రచ్చ చేస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి హెచ్ సీయూ భూముల పరిధిలో ఎలాంటి అటవీ ప్రాంతం లేదని..జింకలు, వన్యప్రాణులు లేవని చెప్పిన మాటలను గుర్తు చేస్తూ జింక మరణాన్ని లేవనెత్తుతూ తమ గళాన్ని వినిపిస్తున్నారు. జింక మరణంపై రేవంత్ రెడ్డి ఇప్పుడేం సమాధానం చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇదే ప్రశ్నలతో విద్యార్ధులు కంచ గచ్చిబౌలి భూముల పట్ల ప్రభుత్వ వైఖరిని ఏకిపారెస్తున్నారు. మరోవైపు హెచ్ సీయూలో చెట్లను కొట్టివేయడంతో జింకల గుంపులు చెల్లచెదురయ్యాయి. ఓ జింక కుక్కల దాడిలో చనిపోతే మరో జింక క్యాంపస్ దగ్గరలో ఉన్న ఇంటిలోకి వచ్చింది. గోపనపల్లి ఎన్టీఆర్ నగర్ లోని ఇంటిలోకి జంక రావడంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

Exit mobile version