హైదరాబాద్ సిటీ కాలేజీలో వ్యాసరచన పోటీలు ప్రారంభం విధాత: తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం విలువలు విశిష్టతలు అనే అంశం పైన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబోయే వ్యాసరచన పోటీలను ఈరోజు ప్రభుత్వ సిటీ కళాశాల హైదరాబాద్ నందు ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని వర్గాలకు హక్కులు దక్కాలంటే అది మన రాజ్యాంగం ద్వారానే సాధ్యమని […]
విధాత: తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం విలువలు విశిష్టతలు అనే అంశం పైన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబోయే వ్యాసరచన పోటీలను ఈరోజు ప్రభుత్వ సిటీ కళాశాల హైదరాబాద్ నందు ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని వర్గాలకు హక్కులు దక్కాలంటే అది మన రాజ్యాంగం ద్వారానే సాధ్యమని అన్నారు. సమకాలీన సమాజంలో రాజ్యాంగం ద్వారానే ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో లౌకికవాదాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు.
రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగ విలువలను రక్షించడానికి ప్రజాస్వామ్య వాదులు ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శవంతంగా నిలిచింది అని ఆయన అభిప్రాయపడ్డారు. మానవతావాదం చచ్చిపోతే మను వాదం రాజ్యమేలుతుంది అని దేశపతి ఆందోళన వ్యక్తం చేశారు. సిటీ కాలేజీ నుండి వేలాది మంది విద్యావంతులను అందించిన గొప్ప చరిత్ర ఉన్న కళాశాల సిటీ కాలేజీ అని ఆయన వివరించారు. ముఖ్ధుం మోహినుద్దీన్ లాంటి విప్లవ కవి కళాశాల అధ్యాపకులుగా పని చేశారని ఆయన తెలిపారు.
సమావేశానికి ముఖ్య వక్తగా హాజరైన చరిత్ర కారులు కొప్పర్తి వెంకట రమణ మూర్తి మాట్లాడుతూ వందలాది చారిత్రక ఘటనల్లో భారత రాజ్యాంగం అత్యంత కీలకమైందని ఆయన వివరించారు. లౌకిక వాదులు ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటు పడకుంటే పౌరుల హక్కులకు భంగం కలుగుతుంది అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన భారత రాజ్యాంగం ద్వారానే సాధ్యమైందని వివరించారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగంలో విశేషమైన అధికారాలు ఆదేశాలను పొందుపరిచింది అని ప్రొఫెసర్ లింబాద్రి గుర్తు చేశారు.
రాజ్యాంగాన్ని మనం రక్షిస్తే తిరిగి రాజ్యాంగం మనలను కాపాడుతుంది అని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సీతారామ రావు అన్నారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ కారుల సమన్వయంతో ఏర్పడిందే తెలంగాణ వికాస సమితి అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ బాల భాస్కర్, తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బాలకృష్ణ, తెలంగాణ ప్రైవేటు డిగ్రీ కళాశాలల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్, కార్యదర్శి పరమేష్, తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు పిండిగ వెంకన్న, కార్యవర్గ సభ్యుడు రూబీ స్టీవెన్సన్, హైదరాబాద్ అధ్యక్షుడు రాజమహేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, కార్యదర్శి వీర్రాజు, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు దినకర్ భరత్, శశిధర్,కళాశాల అధ్యాపకులు కోయి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.