Diamond కర్నూల్ జిల్లాలో ఓ రైతు పంట పండింది 2 కోట్ల రూపాయలకు కొన్న వజ్రాల వ్యాపారి గుట్టుచప్పుడు కాకుండా జరిగిన లావాదేవీ కర్నూలు, అనంతపూర్ జిల్లాల భూముల్లో తొలకరిలో వజ్రాలు దొరకడం సాధారణమే విధాత: తొలకరి చినుకులు పడగానే రైతులు వ్యవసాయ పనులు మొదలు పెడతారు. దుక్కులు దున్నుతారు. విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సారి వ్యవసాయ పనులు ప్రారంభించాడు. చెలక […]
Diamond
విధాత: తొలకరి చినుకులు పడగానే రైతులు వ్యవసాయ పనులు మొదలు పెడతారు. దుక్కులు దున్నుతారు. విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సారి వ్యవసాయ పనులు ప్రారంభించాడు.
చెలక దిక్కి దున్నుతుండగా, మెరుస్తున్న అరుదైన రాయి అతడి కంట పడింది. దానిని వజ్రాల (Diamond) గురించి తెలిసిన నిపుణుడికి చూపిస్తే అత్యంత విలువైన పింక్ వజ్రమని తేల్చాడు. అంతర్జాతీయ మార్కెట్లో కోట్లలో దానికి విలువ ఉంటుందని తెలిపాడు. ఇంకేముందు ఆ రైతు పంట పడింది.
కర్నూలు జిల్లా తుగ్గలి బసనేపల్లిలో ఇటీవల ఓ రైతుకు పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరికింది. ఓ రైతు వద్ద విలువైన పింక్ వజ్రం ఉన్నదని తెలియడంతో వజ్రాల వ్యాపారులు అతడి ఇంటికి క్యూ కట్టారు. వజ్రాన్ని కొనుగోలు చేయడానికి పోటీపడ్డారు. ఈ వజ్రం విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. గుత్తికి చెందిన వ్యాపారి వజ్రాన్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తున్నది. గుట్టుచప్పుడు కాకుండా ఈ రూ.2 కోట్ల లావాదేవీ జరిగినట్టు సమాచారం.
ఒక్క వజ్రమైనా దొరక్కపొదా
రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాల సరిహద్దు భూముల్లో విలువైన వజ్రాలున్నాయని చరిత్రకారులు అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో వజ్రాల కోసం స్థానికులే కాకుండా ఇతర జిల్లాల నుంచి ప్రజలు వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. గ్రామాల్లో అందరూ పొలాలవైపు వెళ్లి వజ్రాల వేటలో బిజీ అవుతారు. కొద్దిరోజులుగా వర్షాలు పడటంతో వజ్రాలు పైకి లేస్తున్నాయి.
ముఖ్యంగా కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని తుగ్గలి, మద్దికెర, బసినేపల్లి, జొన్నగిరి, ఎర్రగుడి, పెరవలి, అగ్రహారం, పగిడిరాయి, గిరిగెట్ల, రాతన కొత్తూరు, అమినాబాద్, రాతన ప్రాంతాలు వజ్రాలు, విలువైన రాళ్లకు ప్రసిద్ధి.
ఆ గ్రామాల భూముల్లో ఏటా వర్షాకాలంలో వజ్రాలు దొరుకుతూనే ఉన్నాయి. అందుకే ఈ సీజన్లో జనాలు ఆశతో వజ్రాల కోసం గాలిస్తుంటారు. ఒక్క వజ్రమైనా దొరక్కపొదా అనే ఆశతో వెతుకుతుంటారు. ఒకవేళ మెరుస్తూ రాయి కనిపిస్తే చాలు వజ్రాల వ్యాపారి దగ్గరకు పరుగులు పెడుతున్నారు.