మిస్టర్ రేవంత్ రెడ్డి.. నీ భాష మార్చుకో...నీ ప్రతాపమో.. నా ప్రతాపమో పాలమూరు గడ్డ పై తెల్చుకుందాం రా... నీ రౌడీయిజం ఆడబిడ్డ పై కాదు...నీ బెదిరింపులకు బయపడడానికి గులాబీ పార్టీ కాదు ఇక్కడ ఉన్నది కమలం పార్టీ... అని డీకే అరుణ సీఎం రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు
ఎవరి ప్రతాపం ఏంటో పాలమూరులో తెల్చుకుందాం రా
అభివృద్ధి పై పాలమూరు నడి బొడ్డున చర్చకు సిద్ధమా
ఒక్క ఆడబిడ్డ పై దాడి చేసేందుకు రాక్షసుల్లా వస్తున్నారు
మహిళ ల పై సంస్కారం లేకుండా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి
ఆడబిడ్డను పండబెట్టి తొక్కుతా అని అంటావా.. స్థాయికి మించి మాట్లాడితే ఊరుకోము
మిస్టర్ రేవంత్ రెడ్డి భాష మార్చుకో ఖబర్దార్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డీకే అరుణ వార్నింగ్
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: మిస్టర్ రేవంత్ రెడ్డి.. నీ భాష మార్చుకో…నీ ప్రతాపమో.. నా ప్రతాపమో పాలమూరు గడ్డ పై తెల్చుకుందాం రా… నీ రౌడీయిజం ఆడబిడ్డ పై కాదు…నీ బెదిరింపులకు బయపడడానికి గులాబీ పార్టీ కాదు ఇక్కడ ఉన్నది కమలం పార్టీ… అని మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సీఎం రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు.శనివారం జిల్లా కేంద్రం లోని బీజేపీ కార్యాలయం లో నిర్వహించిన మీడియా సమావేశం లో ఆమె మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని,ఇది తెలుసుకున్న రేవంత్ రెడ్డి బీజేపీ పై, తనపై వ్యక్తిత్వం పై నీచమైన భాష ఉపయోగిస్తున్నారని అరుణ పేర్కొన్నారు.పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత పాలమూరు జిల్లా కు అయిదు సార్లు వచ్చారన్నారు.
మొన్న బీజేపీ నామినేషన్ ర్యాలీ చూసి కాంగ్రెస్ భయపడి పోయిందన్నారు. మహిళ అని చూడకుండా అసభ్యంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి కి పాలమూరు మహిళలు బుద్ది చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. ఒక్క అరుణమ్మ ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ నేతలు రాక్షసుల్లా దాడి చేసేందుకు గుంపులుగా వస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై మాట్లాడకుండా.. రేవంత్ రెడ్డి ఇక్కడి కొచ్చి నోటికొచ్చినట్లు తిట్టి పొతున్నారన్నారు. ఈ ప్రాంత బిడ్డగా ప్రజల మన్ననలు పొందుతుంటే రేవంత్ రెడ్డి ఓర్చుకోలేక పోతున్నారని అరుణ అన్నారు.
ఒక్క అరుణమ్మ ను ఓడించాలని నోటికొచ్చి మాట్లాడుతూ మనోధైర్యాన్ని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ నాయకుల కంకణం కట్టుకున్నారని, మహిళనని చూడకుండా దొరసాని, తొక్కుతా అని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న రేవంత్ స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారన్నారు. ఇవాల రేవంత్ రెడ్డి ఈ ప్రాంత ఎమ్మెల్యే , ఎంపీ గా ఉండి పాలమూరు కోసం ఏం చేసాడో చెప్పాలని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ ల కోసం కోట్లాడినవా… నువ్ ఏం చేసావని పాలమూరు లో ఓట్లు అడుగుతున్నావు..అని దుయ్యబాట్టారు.ప్రస్తుతం జరిగే పార్లమెంట్ ఎన్నికలు దేశానికి ప్రధాని ఎవరో నిర్ణయించే ఓటు ప్రజల చేతుల్లో ఉందని,
అరుణమ్మను గెలిపిస్తే మోదీ ప్రధాని అవుతారన్నారు.
ఓటుకు.. నోటుకు దొంగవు నువ్వు
మిస్టర్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం నువ్వు ముఖ్య మంత్రి వి కావొచ్చు.. అంతకు ముందు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగవు.. నువ్వా మాకు నీతులు చెప్పేది.. నా బాగోతం చెప్తావన్నావ్ కదా రా నీ బాగోతం ఏంటో నేను చెప్తా అంటూ అరుణ సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి కి దమ్ము, ధైర్యం ఉంటే పాలమూరు తెలంగాణా చౌరస్తా కు రా నువ్వో నేనో తెల్చుకుందాం అంటూ అరుణ హెచ్చరించారు.
ముందుగా ముఖ్య మంత్రి స్థాయి పరువు కాపాడు.. గద్వాల కోట గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
మా మామ డీకే సత్యరెడ్డి ,మా నాన్న చిట్టెం నర్సిరెడ్డి గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిదని ప్రశ్నించారు. నన్ను తొక్కుతా అంటావా… రా దమ్ముంటే ఎక్కడికోస్తావో రా.. బిడ్డా నోటికొచ్చినట్లు మాట్లాడుతావా…నీకు తల్లి, చెల్లి, బిడ్డా లేదా అని మండిపడ్డారు. మహిళా నేత గురించి ఎలా మాట్లాడాలి అన్న సంస్కృతి కూడా లేదా… రేవంత్ నీ నీచ, అహంకార సంస్కృత్తిని చూసి ప్రజలు అసహించుకుంటున్నారన్నారు.
ఆగస్టులోగా రైతు రుణమాఫీ రాకపోతే నీ సీఎం పదవికి రాజీనామా చేస్తావా.. హామీలు అమలు చేయకపోతే పదవి వదిలేస్తావా అని అరుణ సవాల్ విసిరారు.పాలమూరు నిధులు రావాలంటే.. రేవంతో..ఇంకెవరో కొట్లాడితే రావు.. ఇక్కడ అరుణమ్మ గెలిస్తే పాలమూరుకు నిధులు వస్తాయి..పాలమూరుకు కోసం ఆ నాడు ఒక్క మాట మాట్లాడని దదమ్మ రేవంత్ ఇప్పుడు 100 రోజుల్లో నేను అదిచేసినా.. ఇది చేసినా అని గప్పాలు గొట్టడం తప్పితే ఏం చేశావో చెప్పాలన్నారు.
కాంగ్రెస్ నేతలు, సీఎం స్థాయి వ్యక్తి మీ ఆడబిడ్డ అరుణమ్మ ను ఎలా కించ పరుస్తున్నారో పాలమూరు ప్రజలు గమనించాలన్నారు.ఈ సమావేశం లో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నాయకురాలు పద్మజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.