Relationships | వివాహేతర సంబంధాలు, సహజీవనం పేరుతో కలిసి ఉండటం, అభిప్రాయాలు లేదా వారిద్దరి మధ్య గొడవలు తలెత్తితే దారుణంగా చంపడం వంటి ఉదంతాలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. శ్రద్ధావాకర్ హత్య కేసును ఇంకా మరిచి పోకముందే గత రెండు రోజుల్లో జరిగిన హత్యోదంతాలు చూస్తుంటే సమాజం ఎటుపోతున్నది? మనుషుల ఆలోచనా విధానాలు ఎలా మారిపోతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొబైల్ వచ్చిన తర్వాత అదే ప్రపంచమైపోయింది. దీనికితోడు సోషల్ మీడియాలో రీల్స్ కూడా ఎక్కువయ్యాయి. కొందరు […]
Relationships |
వివాహేతర సంబంధాలు, సహజీవనం పేరుతో కలిసి ఉండటం, అభిప్రాయాలు లేదా వారిద్దరి మధ్య గొడవలు తలెత్తితే దారుణంగా చంపడం వంటి ఉదంతాలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. శ్రద్ధావాకర్ హత్య కేసును ఇంకా మరిచి పోకముందే గత రెండు రోజుల్లో జరిగిన హత్యోదంతాలు చూస్తుంటే సమాజం ఎటుపోతున్నది? మనుషుల ఆలోచనా విధానాలు ఎలా మారిపోతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మొబైల్ వచ్చిన తర్వాత అదే ప్రపంచమైపోయింది. దీనికితోడు సోషల్ మీడియాలో రీల్స్ కూడా ఎక్కువయ్యాయి. కొందరు సోషల్ మీడియాను మంచి కోసం వినియోగిస్తుంటే మరికొందరు సమాజాన్ని పక్కదోవ పట్టించేలా వీడియోలు పెడుతున్నారు. దీంతో దారుణ హత్యలు ఎలా జరిగాయో రీల్స్ చేసి మరీ పెడుతున్నారు.
మహారాష్ట్రలో మనోజ్ సహానీ అనే నిందితుడు తన సహజీవన భాగస్వామి సరస్వతి వైద్యను హత్య చేసి ఆమె శరీరాన్ని ముక్కులుముక్కలు చేశాడు. అంతేకాదు ఆమె శరీర భాగాలను కొన్నింటిని కుక్కర్లో ఉడికించినట్లు, కాల్చినట్లు పోలీసులు గుర్తించారు. నాలుగురోజుల కిందటే హత్య జరిగినట్లు పోలీసులు అంచనా వేశారు. వాసన రాకుండా రూమ్ ప్రెషనర్ వాడాడు. శద్ధావాకర్ ఘటన చూసే తాను ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించినట్టు కొన్ని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
అయితే ఈ కేసు అనూహ్య మలుపులు తిరుగుతున్నది. తాను సరస్వతిని హత్య చేయలేదని, తాను ఇంటికి వచ్చే సరికే ఆమె ఆత్మహత్యకు చేసుకున్నట్టు కేసులో ఇరుక్కుంటానన్న భయంతోనే ఆమె మృతదేహాన్ని మాయం చేయడానికి ఇలా చేసినట్టు నిందితుడు పోలీసుల విచారణలో చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉన్నది కాబట్టి దీనిపై స్పష్టత రావాల్సి ఉన్నది. అయితే నిందితుడు మృతదేహాన్ని మాయం చేయడానికి వ్యవహరించిన తీరు ఒళ్లు జలదరిస్తున్నది.
ఈ దారుణం నిన్నంతా మీడియాలో సంచలనం సృష్టించింది. ఈలోగా ఈరోజు వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ పూజారి ఓ మహిళను బండరాయి మోది హత్య చేశాడు. అప్పటికే పెళ్లి అయిన వెంకట సాయి కృష్ణ అప్సర సంబంధం పెట్టుకున్నాడు.
ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ఆ మహిళ ఒత్తిడి తీసుకురావడంతో కోపోద్రిక్తుడై ఘోరంగా హత్య చేసి మృతదేహాన్ని మ్యాన్హోల్ లో పడేశాడు. ఏమీ ఎరగనట్లు అప్సర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండురోజులుగా జరిగిన హత్యలను చూస్తే సినిమాటిక్గా కనిపిస్తాయి. మనుషులు ఎంత క్రూరంగా మారుతున్నారో ఈ ఉదంతాలు తేటతెల్లం చేస్తున్నాయి.
వివాహేతర సంబంధాలు, సహజీవనాలు సమాజంలో కొత్త పోకడలకు దారి తీస్తున్నాయి. కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఘటనలు వెలుగులోకి వచ్చాక పోలీసుల విచారణలో నిందితులు వెల్లడిస్తున్న విషయాలు చూస్తుంటే విస్తుపోయేలా ఉంటున్నాయి.
మంచికంటే చెడు త్వరగా వ్యాప్తి చెందుతుందన్నట్టు ఒక క్రైమ్ మరో క్రైమ్కు ప్రేరణగా నిలుస్తున్నదని మహారాష్ట్ర హత్యోదంతం ద్వారా తెలుస్తున్నది. కొంతమంది వ్యక్తిగత స్వార్థం, సుఖాల కోసం ఎన్ని కుటుంబాల్లో అశాంతి నెలకొంటున్నదో ప్రజల్లో అవగాహన పెంచాలి. అప్పుడే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయగలం. లేకపోతే మరిన్నిదారుణాలు చూడాల్సి వస్తుందని పౌర సంఘాల నేతలు, మహిళా సంఘాల నేతలు చెబుతున్నారు.