తెలంగాణలో రాగల మూడురోజుల్లో భానుడీ భగభగలు.. వడగాలుల సెగలు తప్పవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది
ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
కొన్ని చోట్ల తేలికపాటి వానలు
వెల్లడించిన వాతావరణ శాఖ
విధాత: తెలంగాణలో రాగల మూడురోజుల్లో భానుడీ భగభగలు.. వడగాలుల సెగలు తప్పవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లో బుధ, గురు, శుక్ర వారల్లో మరో రెండు మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయని పేర్కోంది. అదే సమయంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడుతాయని వెల్లడించింది.
బుధవారం మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహమూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు ఉదృతి కొనసాగిందని, 18న ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతల నమోదు, వడగాలులు వీస్తాయని తెలిపింది. 19న ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో వడగాల్పులు వీస్తాయని చెప్పింది.
కొన్ని జిల్లాల్లో వర్షాలు
20న రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడ వానలు పడుతాయని తెలిపింది.ఒక ద్రోణి.. దక్షిణ విదర్భ నుంచి మరట్వాడ, ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ ఎత్తులో కొనసాగుతోందని వెల్లడించింది. మరో ద్రోణి.. మన్నార్ గల్ఫ్ నుంచి అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 15 కి. మీ ఎత్తులో కొనసాగుతోందని పేర్కొంది. వీటి ప్రభావంతో బుధ, గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.