High Court | 34 ఎకరాల్లో అక్రమంగా భవనాలు కట్టారు.. 16 వారాలుగా కౌంటర్ దాఖలు చేయ్యడంలేదు పిటిషనర్ తరఫు న్యాయవాది విచారణ 3 వారాలకు వాయిదా హైదరాబాద్, విధాత: తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం ప్రభుత్వం అక్రమంగా 34 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టింది. ప్రతి జిల్లా నుంచి ఒక ఎకరం చొప్పున హైదరాబాద్తో సహా పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం చదరపు గజాన్ని రూ.100 మాత్రమే తీసుకుంటుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం […]
High Court |
హైదరాబాద్, విధాత: తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం ప్రభుత్వం అక్రమంగా 34 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టింది. ప్రతి జిల్లా నుంచి ఒక ఎకరం చొప్పున హైదరాబాద్తో సహా పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం చదరపు గజాన్ని రూ.100 మాత్రమే తీసుకుంటుంది.
ఇలా రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయాలను తక్కువ ధరకు తీసుకొని అక్రమ నిర్మాణాలు చేపడుతుందని దాఖలైన పిటిషన్పై బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ కేసులో ఐదో ప్రతివాదిగా సీఎం కేసీఆర్ ఉన్నారు. కోకాపేటలో రూ.100 కోట్లకు ఎకరం జాగా అమ్ముతున్న ప్రభుత్వం అధికార పార్టీకి పార్టీ కార్యాలయాలు ఏర్పాటుచేసుకునేందుకు మాత్రం చదరపు గజం జాగాను కేవలం రూ.100 కే కేటాయించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లో కలిసి మొత్తం 34 ఎకరాల స్థలాన్ని పార్టీ ఆఫీసుల కోసం ప్రభుత్వం తీసుకున్నదని తెలిపారు. చాలా స్థలాల్లో ఆఫీసులు నిర్మించారని న్యాయస్థానానికి విన్నవించారు. ఈ కేసులో 16 నెలలుగా ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయడం లేదని తెలిపారు.
ప్రభుత్వం వంద కోట్లకు ఎకరం భూమిని ప్రజలకు విక్రయిస్తూ.. పాలకపక్షం ప్రభుత్వ భూములను తమ భవనాల కోసం రూ.100 కేటాయించడం ఏంటని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే, న్యాయమూర్తి వినోద్ కుమార్ ధర్మాసనం పేర్కొన్నది.
దీనిపై వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ తరుఫు న్యాయవాదిని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపురి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.