High Speed Train | ఆరు నెలల్లో హైస్పీడ్ రైలు.. తొలి రైలు పట్టాలెక్కేది ఈ రూట్లోనే..!

High Speed Train | దేశంలో తొలి హైస్పీడ్ ట్రైన్ మరు ఆరునెలల్లో పట్టాలెక్కబోతుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. గుజరాత్ అహ్మదాబాద్ రైల్వేస్టేషన్ నుంచి సనంద్ రైల్వే స్టేషన్ మధ్య తొలి హైస్పీడ్ రైలు పరుగులు తీస్తుందని వెల్లడించారు. గుజరాత్లో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న ఈ ఆయన హైస్పీడ్ రైళ్లపై కీలక ప్రకటన చేశారు. ఇక ఆ స్టేషన్లో వందే భారత్ రైళ్లు కూడా ఆగుతాయని ఆయన స్పష్టం చేశారు. అహ్మదాబాద్-సనంద్ రైల్వే స్టేషన్ల మధ్య అంతర్జాతీయ స్థాయి రైలు సర్వీసులు ప్రారంభంకానున్నాయన్నారు.
ఇప్పటికే రైల్వేశాఖలో కేంద్రం వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెడుతున్నది. ఇప్పటికే పలు మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఆయా రైళ్ల వేగం గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వరకు ఉండగా.. భవిష్యత్లో 200 కిలోమీటర్లకుపైగా వేగంతో దూసుకుపోనున్నాయి. ప్రస్తుతం ఏసీ చైర్కార్ సౌలభ్యం మాత్రమే ఉండగా.. త్వరలోనే స్లీపర్ వందే భారత్ రైళ్లు రాబోతున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ రైళ్లు అందుబాటులోకి వస్తాయని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. త్వరలో పట్టాలెక్కనున్న హైస్పీడ్ రైళ్లు ఎంత వేగంగా వెళ్తాయన్నది ఆసక్తికరంగా మారింది.