• Telugu News
  • /Latest

Javahar Navoday Admissions | జవహర్‌ నవోదయ పిలుస్తోంది..! 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

Javahar Navoday Admissions | జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది. దేశవ్యాప్తంగా 649 జేఎన్‌వీల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం రెండు విడుతల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తొలి పర్వత ప్రాంత రాష్ట్రాల్లో నవంబర్‌ 4న ఉదయం 11.30 గంటలకు ప్రవేశ పరీక్ష జరుగనున్నది. రెండో విడుతలో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జనవరి 20న ఎంట్రెన్స్‌ […]

Reported by: Vineela | latest | IST
Read Time: 5 mins

Javahar Navoday Admissions |

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది. దేశవ్యాప్తంగా 649 జేఎన్‌వీల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం రెండు విడుతల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తొలి పర్వత ప్రాంత రాష్ట్రాల్లో నవంబర్‌ 4న ఉదయం 11.30 గంటలకు ప్రవేశ పరీక్ష జరుగనున్నది.

రెండో విడుతలో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జనవరి 20న ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆగస్టు 10 వరకు navodaya.gov.in/nvs/en/Home1వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు.

ఆరో తరగతిలో ప్రవేశానికి అర్హత విషయానికి వస్తే.. తప్పనిసరిగా సదరు విద్యార్థి జవహర్‌ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాలో నివాసం ఉండాలి. 2023-24 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతూ ఉండాలి.

అయితే, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75శాతం సీట్లు కేటాయించారు. వారంతా తప్పనిసరిగా 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోనే చదివి ఉండాలి. మిగతా 25శాతం సీట్లను పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. జేఎన్‌వీలో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మే 1, 2012 నుంచి జులై 31, 2014 మధ్యలో జన్మించిన వారై ఉండాలి.

ప్రవేశ పరీక్ష ఇలా..

జవహర్‌ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి. మెంటల్‌ ఎబిలిటీ, అర్థమెటిక్, లాంగ్వేజ్‌‌లలో ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. రెండు గంటల సమయం ఇస్తారు. ఆసక్తి ఉన్న వారు. నవోదయ అధికారిక వెబ్‌సైట్‌ navodaya.gov.in/nvs/en/Home1లోకి లాగినై దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సర్టిఫికెట్‌ సాఫ్ట్‌ కాపీని అప్‌లోడ్‌ చేయాలి. అలాగే అభ్యర్థి ఫొటో, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్‌, నివాస ధ్రువీకరణ పత్రాలను సైతం అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లను అధికారులు సీట్లు కేటాయిస్తారు. రెండు విడతల్లో నిర్వహించే ఈ పరీక్ష ఫలితాలను వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో విడుదల చేసే అవకాశం ఉంది.