Karimnagar: ప్రైవేట్ చిట్ ఫండ్ యాజమానులకు CP సుబ్బారాయుడు వార్నింగ్
సకాలంలో డబ్బు చెల్లించక పోతే చర్యలు తప్పవని హెచ్చరిక విధాత బ్యూరో, కరీంనగర్: ప్రైవేట్ చిట్ ఫండ్ యాజమాన్య ప్రతినిధులకు పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు వార్నింగ్ ఇచ్చారు. గురువారం ప్రైవేట్ చిట్ ఫండ్ యజమానులతో కమిషనరేట్ కార్యాలయంలో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడువు ముగిసినా, చిట్ గ్రూప్ లోని సభ్యులకు యాజమాన్యాలు సకాలంలో డబ్బు చెల్లించట్లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రజలు తమ భవిష్యత్ అవసరాల కోసం చిట్ ఫండ్ […]

- సకాలంలో డబ్బు చెల్లించక పోతే చర్యలు తప్పవని హెచ్చరిక
విధాత బ్యూరో, కరీంనగర్: ప్రైవేట్ చిట్ ఫండ్ యాజమాన్య ప్రతినిధులకు పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు వార్నింగ్ ఇచ్చారు. గురువారం ప్రైవేట్ చిట్ ఫండ్ యజమానులతో కమిషనరేట్ కార్యాలయంలో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడువు ముగిసినా, చిట్ గ్రూప్ లోని సభ్యులకు యాజమాన్యాలు సకాలంలో డబ్బు చెల్లించట్లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు.
ప్రజలు తమ భవిష్యత్ అవసరాల కోసం చిట్ ఫండ్ సంస్థలను నమ్మి, డబ్బులు కూడపెట్టుకుంటారని అయితే వారికి సకాలంలో డబ్బు అందించకుండా చిట్ ఫండ్ యజమానులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. కొన్ని సంస్థలు ఏకంగా డబ్బుకు బదులు తక్కువ ధర గల భూములను ఎక్కువ మొత్తానికి చూపిస్తూ బలవంతపు రిజిస్ట్రేషన్ చేయించి గ్రూప్ సభ్యులకు అంటగడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు.
ఇటువంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేంత వరకు పోలీసులు వారి వెంటే ఉంటారని తెలిపారు. అన్ని ప్రైవేట్ చిట్ ఫండ్ యాజమాన్యాలకు వారం రోజులు గడువు ఇస్తున్నామని ఈలోగా వారి సంస్థల యొక్క పూర్తి వివరాలను కోరిన విధంగా అందజేయాలని తెలిపారు.ఆ వివరాల ఆధారంగా పూర్తిస్థాయిలో విచారణ చేపడతామన్నారు.
విచారణ అనంతరం సమావేశం నిర్వహిస్తామని దానికి అన్ని యాజమాన్యాలు తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపారు. ప్రైవేట్ చిట్ ఫండ్ సంస్థలకు తాము వ్యతిరేకం కాదని, చట్ట పరిధిలో పరిమితులకు లోబడి వ్యాపారం చేసుకోవాలని సూచించారు. పరిమితులను ఉల్లంఘించిన లేదా గ్రూపు సభ్యులకు సకాలంలో డబ్బు చెల్లించక ఇబ్బందులకు గురిచేసే సంస్థల యాజమాన్యాలకు కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ప్రసన్న, చిట్ రిజిస్ట్రార్ దిలీప్ చంద్ర గోపాల్, ఎస్బిఐ వెంకటేశ్వర్లు, పలు చిట్ ఫండ్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.